
రక్షిత్, నక్షత్ర జంటగా ప్రముఖ రచయిత కరుణకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం పలాస 1978. విడుదలకు ముందే ఎంతో మంది సినీ ప్రముఖులు, మేథావుల ప్రశంసలందుకుంది. ఉత్తరాంధ్రలో ఒక ఊరి కథ అంటూ విడుదలైన పలాస కథేంటీ, అంతగా మేథావులను ఆకట్టుకున్న పలాసలో ఏముందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
పలాస కథ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయ కుట్రలో బలైన జానపద కళాకారుల కుటుంబ కథ. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని అంబుసోలి గ్రామంలో పద్యాల సుందర్ రావు కు రంగారావు(తిరువీర్), మోహన్ రావు(రక్షిత్) ఇద్దరు కుమారులు. కుటుంబమంతా జానపద పాటలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అలరిస్తూ జీవిస్తుంటారు. పలాసలో పెద్దషావుకారు(జనార్దన్), చిన్నషావుకారు గురుమూర్తి(రఘు కుంచె) అన్నదమ్ములు. వారి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలో ఓ రోజు పెద్దషావుకారు కొడుకు తారకేశు సినిమా థియేటర్ వద్ద రంగారావు చేసుకోబేయే అమ్మాయి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అది సహించలేని అన్నదమ్ములిద్దరూ ఓ రోజు రాత్రి మాటువేసి తారకేశును చితకొడుతారు. ఈ గొడవలో తారకేశు కొద్దిరోజులు మంచానికే పరిమితమవుతాడు. కళ్లముందే కొడుకు మంచానికి పరిమితమవడంతో తట్టుకోలేని పెద్దషావుకారు పలాస రౌడీ బైరాగితో అన్నదమ్ములిద్దరిని చంపమని పురమాయిస్తాడు. ఆ ప్రయత్నంలో రంగారావు, మోహన్ రావు… బైరాగిని చంపేసి పెద్దషావుకారుకు ఎదురుతిరుగుతారు. అన్నను ఎదిరిరించిన రంగా, మోహన్ లను చిన్నషావుకారు తన దగ్గర చేర్చుకుంటాడు. రాజకీయంగా లబ్ధి పొందుతాడు. అప్పుడే పలాసకు ఎన్నికలొస్తాయి. ఎన్నాళ్లీ బతుకులు. తమ కులం వాళ్లు కూడా రాజకీయంగా ఎదగాలని భావిస్తాడు రంగారావు. పలాస టికెట్ ఆశిస్తాడు. అందుకు చిన్నషావుకారు ఒప్పుకోడు. ఘోరంగా అవమానించి పంపిస్తాడు. ఇంతలోనే పెద్దషావుకారు భార్య మరిదిని వెతుక్కుంటూ వచ్చి తన కొడుకును మంచాన పడేసిన వాళ్లను వదిలిపెట్టొద్దని ప్రాధేయపడుతుంది. వదిన మాటలకు చలించిపోయిన చిన్నషావుకారు… అన్నదమ్ములిద్దరిని ఒకేసారి చంపేందుకు కుట్రపన్నుతాడు. కిరాయిగుండాలతో రంగారావును అత్యంత కిరాతకంగా చంపిస్తాడు. కళ్లముందే అన్న చనిపోవడంతో తట్టుకోలేని మోహన్ రావు… పెద్దషావుకారు, చిన్నషావుకారులను చంపాలనుకుంటాడు. ఓ రోజు మార్కెట్ లో పెద్దషావుకారును మట్టుబెడతాడు. ఆ వార్త విన్న చిన్నషావుకారు రహస్యంగా జీవిస్తూ బైరాగి కొడుకు(మాజీ నక్సలైట్) తో మోహన్ రావును చంపాలని ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ లో మోహన్ రావు భార్య లక్ష్మి(నక్షత్ర) చనిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సోదరుడు, భార్యను హత్య చేయించిన చిన్నషావుకారిని మోహన్ రావు ఏం చేశాడు? షావుకార్ల రాజకీయ కుట్రకు బలైన మోహన్ రావు చివరకు ఏమయ్యాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమాజంలో మనుషుల మధ్య అంతరాలను ఎత్తిచూపుతూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథ పలాస. 1978లో రాజకీయాలంటే మేమే చేయాలి, మాకోసం ఊరి చివరి వ్యక్తులు ఊడిగం చేయాలనే ఆలోచనతో కనిపించే కొంతమంది వ్యక్తుల నైజాన్ని తనదైన శైలిలో చూపించాడు దర్శకుడు కరుణకుమార్. రచయితగా తన అనుభవాన్నంతా రంగరించి ఎక్కడా ఎవరిని తిట్టిపోసే ప్రయత్నం చేయకుండా చక్కగా పాత్రలు మాత్రమే కనిపించేలా కథను అల్లుకుంటూ పోయాడు. సహజత్వానికి దగ్గరగా ప్రతి పాత్రను, ప్రతి సన్నివేశాన్ని పేర్చుకుంటూ వెళ్లాడు. పెద్దషావుకారు హత్య విచారణతో మొదలైన పలాస కథ… ఫస్టాప్ లో నాటి పలాసలో జానపద కళాకారుల పరిస్థితి, అణగారిన వర్గాలపై షావుకార్ల పెత్తందారి వ్యవస్థను ఎలా ఉండేదో చూపిస్తూ… అన్నదమ్ములు రంగా, మోహన్ రావులు ఎలా తిరగబడ్డారో వివరిస్తూ కథను విశ్రాంతికి చేర్చాడు.
విశ్రాంతి ముందు వచ్చే బైరాగి రాయి ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. సెకండాఫ్ లో రాజకీయ కుట్రలో అన్నదమ్ములలను ఎలా పావులుగా వాడుకున్నారు, వారి మధ్య చిచ్చుపెట్టడం, కుటుంబ కలహాలు, భావోద్వేగాలతో నడిపించి కథలో ఆసక్తికర మలుపులుతో ప్రేక్షకుడ్ని లీనం చేశాడు. ఎప్పుడైతే అన్న చనిపోతాడో అప్పటి నుంచి కథ కీలక దశకు చేరుతుంది. ప్రతీకారంతో రగిలిపోయే మోహన్ రావు… పలాసలో భయాన్ని పొగొట్టేందుకు పోలీసుల చర్యలు… ఆ తర్వాత పరిణామాలను సినిమా వేగంగా పెంచాయి. అయితే పతాక సన్నివేశాలకు వచ్చేసరికి పోలీస్ స్టేషన్ లో కథానాయకుడు చెప్పే సంభాషణలు నాటి అసమానతలును గుర్తుచేశాయి, రాజకీయ చదరంగంలో అణగారిన వర్గాల ప్రజలు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో చెబుతూ పలాస కథను ముగించాడు. కథ పరంగా పలాస రంగస్థలం, అసురన్ చిత్రాలను గుర్తుచేసినా దర్శకుడు తనదైన శైలిలో కథనాన్ని తీర్చిదిద్ది కొత్తదనాన్ని చూపించాడు. రంగా, మోహన్ రావులతోపాటు పెద్దషావుకారు, చిన్నషావుకారు పాత్రలు పలాస కథకు ప్రాణం పోశాయి.
ఈ కథను భుజానికెత్తుకుంది నలుగురు. వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. దర్శకుడు ఎలాంటి కథ రాసుకున్నా అందుకు తగిన నటీనటులు దొరకపోతే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కానీ పలాస కథకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. మోహన్ రావుగా రక్షిత్ నాలుగు కోణాల్లో కనిపిస్తూ మెప్పించాడు. రంగారావుగా తిరువీర్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పెద్దషావుకారు గా జనార్దన్, గురుమూర్తిగా రఘు కుంచె తమదైన నటనతో పలాసను ఆద్యంతం రక్తికట్టించారు. పలాసకు రఘు కుంచె సంగీత దర్శకుడి ప్రాణం పెట్టి పనిచేశారని నేపథ్య సంగీతాన్ని వింటే అర్థమవుతుంది. అలాగే టాలీవుడ్ కు మరో కొత్త విలన్ దొరికాడనేలా నటించి చూపించారు. కథానాయిక నక్షత్ర తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. మిగతా పాత్రల్లో చేసిన నటీనటులంతా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడిగా కరుణకుమార్ పలాస మొదటి చిత్రంతో శభాష్ అనిపించుకున్నాడు. విడుదలకు ముందే చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, మేథావులు, సినీ విశ్లేషకుల ప్రశంసలందుకున్న కరుణకుమార్ పలాసను జాతీయ ఉత్తమ చిత్రాల క్యాటగిరిలో నిలబెట్టాడు. మాటల్లో తన కలం బలమేంటో చూపించిన కరుణకుమార్…. చేతల్లోనూ ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీర్చిదిద్ది పలాసను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మంచి చిత్రంగా తీర్చిదిద్దారు. నిర్మాత ధ్యాన్ అట్లూరికి, సమర్పకుడు తమ్మారెడ్డి భరద్వాజకు పలాస ఒక మైలురాయి చిత్రంగా నిలిచిపోతుంది.