
- మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు
- డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు
నిర్మల్, వెలుగు: పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మల్ జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారని డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు తెలిపారు. జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారని, వారి శ్రేయస్సు దృష్ట్యా నిర్మల్లోనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించామని పేర్కొన్నారు.
సోన్ మండలం పాక్ పట్ల సమీపంలో పరిశ్రమ నిర్మాణానికి 40 ఎకరాల భూసేకరణ జరిగిందని చెప్పామన్నారు. ఫ్యాక్టరీని ఇతర జిల్లాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలుపగా నిర్మల్ లోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, నాయకులు రాజేశ్వర్, నరేశ్ రెడ్డి తదితరులున్నారు.