సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లాలో మొత్తం 201 నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్ డివిజన్ పరిధిలోని 5, సిద్దిపేట డివిజన్ పరిధిలోని 2 మండలాల్లోని మొత్తం 162 గ్రామ పంచాయతీలు1432 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
గజ్వేల్ మండలంలో సర్పంచ్ స్థానాలకు34, వార్డులకు 4, మర్కుక్ మండలంలో సర్పంచ్ 23, వార్డులు18, వర్గల్ మండలంలో సర్పంచ్ 7, వార్డులు 5, ములుగు మండలంలో సర్పంచ్ 16, వార్డులు11 , దౌల్తాబాద్ మండలంలో సర్పంచ్ 15, వార్డులు 6, రాయపోల్ మండలంలో సర్పంచ్ 13, వార్డులు 7, జగదేవ్ పూర్ మండలంలో సర్పంచ్ 22, వార్డులకు 20 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆయా గ్రామాల్లో కలెక్టర్ హైమవతి పర్యటించారు. నామినేషన్ల దాఖలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ములుగు మండలం చిన్న తిమ్మాపూర్, సింగన్నగూడ గ్రామపంచాయతీలో నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు హరిత పరిశీలించారు.
మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 29తో ముగుస్తుండడంతో రేపు, ఎల్లుండి భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు 55 నామినేషన్లు దాఖలు
మెదక్/పాపన్నపేట : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 55 నామినేషన్లు దాఖలయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలంలో 16, పాపన్నపేట మండలంలో 13, పెద్ద శంకరం పేట మండలంలో 8, రేగోడ్ మండలంలో 7, అల్లాదుర్గం మండలంలో 6, టేక్మాల్ మండలంలో 5 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు మెంబర్ స్థానాలకు హవేలీ ఘనపూర్ మండలంలో 3, టేక్మాల్ మండలంలో ఒక నామినేషన్ దాఖలైంది.
మొదటిరోజు 147 నామినేషన్లు
సంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా మొత్తం 613 గ్రామ పంచాయతీలు, 5,370 వార్డు స్థానాలు ఉండగా మొదటి విడతలో సంగారెడ్డి డివిజన్ లోని 7 మండలాల పరిధిలో 136 పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా 7 క్లస్టర్ల పరిధిలో సర్పంచ్ స్థానాలకు మొదటిరోజు 147 నామినేషన్లు, వార్డు స్థానాలకు 149 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు సంగారెడ్డి మండలంలో 11, కందిలో 55, కొండాపూర్ లో 29, సదాశివపేట లో 21, పటాన్ చెరులో 6, గుమ్మడిదలలో 5, హత్నూర మండలంలో 20 నామినేషన్లు దాఖలయ్యాయి.
