
- స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ సెంటర్లలో పంచాయతీ ఆఫీసుల నిర్వహణ
- కొత్తగా ఏర్పడిన గ్రామాల్లో నేటికీ బిల్డింగ్స్ కట్టని ప్రభుత్వం
- చెట్ల కింద, ఇరుకు గదుల్లో కూర్చుంటున్న స్టూడెంట్లు
సూర్యాపేట, వెలుగు: పరిపాలనా సౌలభ్యం కోసం 500 జనాభా కలిగిన ప్రతి తండాను పంచాయతీగా మార్చిన ప్రభుత్వం ఆఫీస్ బిల్డింగ్స్ నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాలను ఏర్పాటు చేసి నాలుగేళ్లు గడుస్తున్నా సొంత బిల్డింగ్ల నిర్మాణానికి ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో సర్కార్ స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ సెంటర్లలో పంచాయతీ ఆఫీస్లను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సూర్యాపేట జిల్లాలో 174 పంచాయతీలు
సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా మొదట్లో 323 గ్రామ పంచాయతీలు ఉండేవి. ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామపంచాయతీగా మార్చింది. దీంతో జిల్లాలో కొత్తగా 174 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో ఆరు గ్రామ పంచాయతీలను ఆర్అండ్ఆర్ సెంటర్లలో ఏర్పాటు చేశారు. కొత్త వాటితో కలుపుకొని జిల్లాలో మొత్తం గ్రామాల సంఖ్య 475కు చేరుకుంది. వీటిలో 306 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉండగా, 123 పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 26 గ్రామాల్లో కొత్త బిల్డింగ్స్ నిర్మించేందుకు గతేడాది శాంక్షన్ అయినా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.
సర్కార్ స్కూళ్లలో పంచాయతీలు
సొంత భవనాలు లేని పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెల రూ. వెయ్యి అద్దె చెల్లిస్తోంది. అయితే ఇంత తక్కువకు రెంట్ బిల్డింగ్స్ దొరకకపోవడంతో గ్రామాల్లోని స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లలో పంచాయతీ ఆఫీస్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో దాదాపు 50కి పైగా గ్రామపంచాయతీలు స్కూళ్లలోనే కొనసాగుతున్నాయి. ఓ వైపు క్లాస్రూంల కొరతతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతుంటే, ఉన్న రూమ్స్ను సైతం పంచాయతీ ఆఫీస్లకు కేటాయించడంతో స్టూడెంట్లు చెట్ల కింద, ఇరుకు గదుల్లో కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి పంచాయతీలకు పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రతినిధులు కోరుతున్నారు.
- చివ్వెంల మండలంలో అక్కలదేవిగూడెం మండల పరిషత్ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 45 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్కూల్లో రెండు క్లాస్రూమ్స్ ఉండగా ఒకదానిని గ్రామపంచాయతీకి కేటాయించారు. దీంతో ఉన్న ఒక్క రూమ్లోనే 45 మందిని కూర్చోబెడుతున్నారు. అలాగే భజ్యాతండా, ఎంజీనగర్ తండా, సూర్యానాయక్ తండాల్లోనే స్కూళ్లలోనే పంచాయతీ ఆఫీస్లను ఏర్పాటు చేశారు.
- పెన్పహాడ్ మండలంలో కొత్తగా 12 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో రంగయ్యగూడెం, నాగులపాడు గ్రామ పంచాయతీ ఆఫీసులను ఆయా గ్రామాల్లోని స్కూళ్లలో ఏర్పాటు చేయగా, అన్నారం బ్రిడ్జి పంచాయతీ గోపాల మిత్ర భవనంలో కొనసాగుతోంది.
- తుంగతుర్తి మండలంలో 12 కొత్త పంచాయతీలు ఏర్పాటు కాగా, ఇందులో 10 పంచాయతీల ఆఫీసులు ప్రైమరీ స్కూళ్లలోనే నడుస్తున్నాయి. ఒక దేవునిగుట్ట తండాలో మాత్రమే పంచాయతీ బిల్డింగ్ పూర్తైంది.
- మఠంపల్లి మండలంలోని లాలితండా కొత్త పంచాయతీగా మారింది. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లోని ఒక రూంలో పంచాయతీ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణానికి ప్రపోజల్స్ పంపినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
- హుజూర్నగర్ మండలంలోని మర్రిగూడెం గ్రామ పంచాయతీకి భవనం లేకపోవడంతో ఖాళీగా ఉర్దూ స్కూల్ బిల్డింగ్లో ఆఫీస్ను నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణం కోసం దాతలు కుంట స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. దీంతో కొత్త బిల్డింగ్ కట్టేందుకు ప్రపోజల్స్ పంపినా స్పందన లేదు.
- చింతలపాలెం మండలంలో కొత్తగా ఆరు పంచాయతీలు ఏర్పాటు చేయగా వీటిలో ఎర్రకుంటతండా గ్రామ పంచాయతీ సర్కార్ స్కూల్లో కొనసాగుతోంది.
- మేళ్లచెరువు మండలంలో కొత్తగా 6 పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో రెండు గ్రామ పంచాయతీ ఆఫీస్లను స్కూళ్లలో ఏర్పాటు చేయగా, మరో రెండు ఆఫీస్లు కమ్యూనిటీ హాల్స్లో కొనసాగుతున్నాయి.
ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం
జిల్లాలో 101 గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం. సర్కార్ నుంచి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో ఉన్న బిల్డింగ్స్లో పంచాయతీ ఆఫీస్లను నిర్వహిస్తున్నాం. – యాదయ్య, డీపీవో, సూర్యాపేట