హైదరాబాద్, వెలుగు: హైకోర్టులోని అన్ని కోర్టుల్లో కేసుల విచారణ ప్రత్యక్ష, పరోక్ష( వీడియో కాన్ఫ రెన్స్) విధానం త్వరలోనే ప్రారంభిస్తామని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. ఇప్పటికే పరోక్ష హైబ్రిడ్ విధానం ఫస్ట్ కోర్టులో అమల్లో ఉందన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ జిల్లాల్లో న్యాయ నిర్మాణ్ డాక్యుమెంట్ ప్రకారం జిల్లా కోర్టుల కాంప్లెక్స్ నిర్మాణాలు చేస్తామన్నారు. కోర్టు కాంప్లెక్స్ ల కోసం ప్రభుత్వం 5 నుంచి 20 ఎకరాల భూమి ఇచ్చిందని సీజే చెప్పారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం హైకోర్టులో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. కోర్టుల్లోని డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు సీజే వెల్లడించారు. పేపర్ లెస్ కోర్టులుగా రూపొందిస్తామన్నారు. లాయర్లు, జడ్జీలు (బార్ అండ్ బెంచ్) సమష్టిగా పనిచేస్తే కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందన్నారు.
అప్పుడే ప్రజలకు కోర్టులపై మరింత విశ్వసనీయత ఏర్పడుతుందన్నారు. ఈ ఏడాది నేషనల్ లోక్ అదాలత్ల నిర్వహణలో భాగంగా తెలంగాణలో నిర్వహించిన కార్యక్రమాల్లో 7.10 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. రెగ్యులర్ లోక్అదాలత్ల్లో 41 వేల కేసులు సెటిల్ అయ్యాయని సీజే వెల్లడించారు. 1,815 లీగల్ అడ్వయిజరీ క్యాంప్స్ నిర్వహణ జరిగిందని, మీడియేషన్ పద్ధతిలో గత 6 నెలల్లో 283 కేసులు రాజీ అయ్యాయన్నారు. ఏజీ బీఎస్ ప్రసాద్. బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, న్యాయాధికారులు పాల్గొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన కోర్టు స్టాఫ్ పిల్లలకు హైకోర్టు అటెండర్ జేసీ విరూపాక్ష రెడ్డి అందజేసిన ప్రతిభా పురస్కారాలను చీఫ్ జస్టిస్ అందజేశారు. గత 26 ఏండ్లుగా విరూపాక్షరెడ్డి ప్రతిభా పురస్కారాలను ఇస్తున్నారు. బార్ కౌన్సిల్ భవనం వద్ద బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.. వైస్ చైర్మన్ సునీల్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.