
భద్రాచలం, వెలుగు : భద్రాచలం నుంచి పాపికొండల టూరిజానికి ఏపీ సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భద్రాచలానికి సరిహద్దున ఉన్న విలీన వీఆర్ పురం మండలం పోచవరం గ్రామం నుంచి పాపికొండలకు లాంచీలు తిరగనున్నాయి.
భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా మూడు నెలల కింద పాపికొండల టూరిజాన్ని నిలిపివేశారు. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, పోచమ్మగండి ప్రాంతం నుంచి పాపికొండల టూరిజాన్ని ప్రారంభించగా.. తాజాగా భద్రాచలం నుంచి లాంచీలకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పాపికొండల సందర్శనకు వెళ్లేందుకు టికెట్ ధరలను పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు. భద్రాచలం వచ్చే భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక వాహనాల్లో పోచవరం చేరుకొని అక్కడి నుంచి పాపికొండలు, పేరంటాలపల్లికి లాంచీల్లో వెళ్లనున్నారు. టూరిస్ట్ల కోసం పోచవరం నుంచి 22 లాంచీలను సిద్ధం చేస్తున్నారు.