
సినిమా బండి, శుభం చిత్రాల తర్వాత ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘పరదా’. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ కలిసి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ ‘ఇదొక ఫిక్షనల్ స్టోరీ. కానీ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి.
ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్లలో కూడా ఒక పరదా ఉంటుందని ఇందులో చూపిస్తున్నాం. ఇది కచ్చితంగా జనం మాట్లాడుకునే సినిమా అవుతుంది. స్టోరీ విని అనుపమ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇందులో తనను గొప్ప పెర్ఫార్మర్గా చూస్తారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా విషయాలు రిలేట్ చేసుకుంటారు. ‘శుభం’కంటే ముందే రావాల్సిన సినిమా. దాదాపు మూడేళ్లు పట్టింది. మనాలి, ధర్మశాల లాంటి రియల్ లొకేషన్స్లో వందలమంది క్రూతో షూట్ చేశాం. సినిమా చూస్తున్నప్పుడు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వస్తూనే ఉంటాయి. గోపీ సుందర్ మ్యూజిక్ స్పెషల్ అసెట్గా నిలుస్తుంది’ అని చెప్పారు.