భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ బస్సులోనే ఓ ఆర్టీసీ కండక్టర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం భద్రాచలం వచ్చింది. కండక్టర్ శంకర్ డ్రైవర్తో కలిసి అక్కడే భోజనం చేసి తిరుగు ప్రయాణంలో పరకాల వైపు బయల్దేరారు.
కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద కొంతమంది ప్రయాణికులను ఎక్కించుకున్న అనంతరం శంకర్ టికెట్లు ఇస్తుండగా ఒక్కసారిగా బస్సులోనే కుప్పకూలిపోయాడు. ప్రయాణికులు, డ్రైవర్ శంకర్ను కిందికి దించి సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. ములుగు మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన శంకర్ పరకాల డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు.
