మహబూబ్​నగర్ ఎంపీ టికెట్​కు ఫుల్​ డిమాండ్​

మహబూబ్​నగర్ ఎంపీ టికెట్​కు ఫుల్​ డిమాండ్​
  • ప్రధాన పార్టీల నుంచి పెరుగుతున్న ఆశావాహులు

మహబూబ్​నగర్, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీల నుంచి పాలమూరు టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. టికెట్​ తమకే వస్తుందనే నమ్మకంతో రెండు నెలల ముందు నుంచే పబ్లిక్​కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సభలు, సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో చొరవ చూపుతున్నారు. 

కాంగ్రెస్​ రేసులో వంశీచంద్​రెడ్డి..

కాంగ్రెస్​ పార్టీ నుంచి చల్లా వంశీచంద్​రెడ్డి మహబూబ్​నగర్​ పార్లమెంట్​ నుంచి రేసులో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి టికెట్​ను త్యాగం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపు కోసం పని చేసి, ఆయన గెలుపులో కీ రోల్​ పోషించారు. ఈ క్రమంలో వంశీకి హై కమాండ్​ టికెట్​ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంట్​ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి వంశీ పర్యటనలు ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.

పక్కా ప్రణాళికతో ఎన్నికల బరిలో దిగేందుకు రాష్ట్ర స్థాయిలో సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఈ పార్లమెంట్​కు సీఎం రేవంత్ రెడ్డి ఇన్​చార్జి కావడం, ఆయన సొంత జిల్లా కావడంతో పాలమూరు స్థానంపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. కాంగ్రెస్  పార్టీ నుంచి ఎంపీ టికెట్  కోసం మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు వనపర్తి టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్  చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హైకమాండ్​ హామీ ఇచ్చింది.

ఈ క్రమంలో మహబూబ్​నగర్  ఎంపీగా పోటీ చేసేందుకు చిన్నారెడ్డి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. అలాగే మాజీ ఎమ్మెల్యే సీతమ్మ కూడా రేస్ లో ఉండే అవకాశం ఉంది. అపొజిషన్  పార్టీల క్యాండిడేట్లు, ‌‌‌‌‌‌‌‌సామాజిక సమీకరణాల ఆధారంగా కాంగ్రెస్  పార్టీ కాండిడేట్​ను ప్రకటించే అవకాశం ఉంది.

బీజేపీలో పోటా పోటీ..

బీజేపీలో ఎంపీ టికెట్​ కోసం పోటీ ఎక్కువైంది. మాజీ ఎంపీ ఏపీ జితేందర్​రెడ్డి ముందు నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే, ఈసారి తనకే టికెట్​ వస్తుందనే ఆశతో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి డీకే అరుణ ఈ టికెట్​ కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తన సొంత నియోజకవర్గం గద్వాల నుంచి పోటీ చేస్తారనే చర్చ జరిగినా, బీసీ సామాజిక వర్గానికి టికెట్​ ఇవ్వాలనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకున్నారు.

అయితే పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ నెల 13న మహబూబ్​నగర్​లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. వీరిద్దరితో పాటు ఆ పార్టీ రాష్ట్ర ట్రెజరర్​ శాంతికుమార్​ కూడా టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా పాలమూరు పరధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అయితే బీజేపీ లీడర్లు ఈసారి బీసీలకు ఎంపీ టికెట్​ ఇవ్వాలనే డిమాండ్​ను ముందుకు తెస్తున్నారు.

బీఆర్ఎస్​లో సిట్టింగ్​కా? కొత్త వారికా?

మహబూబ్​నగర్​ సిట్టింగ్​ ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి అన్న కొడుకు మన్నె జీవన్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎంతో కలిసి ఇటీవల ఢిల్లీలో కేసీ వేణుగోపాల్​తో భేటీ అయ్యారు. త్వరలో పార్టీ మారేందుకు టైం చూసుకుంటున్నారు. అయితే ఎంపీ కూడా పార్టీ మారతారనే చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో బీఆర్ఎస్​ నుంచి పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ ఎవరు చేస్తారనే విషయంపై సస్పెన్స్​ కొనసాగుతోంది. బీఆర్ఎస్​ హైకమాండ్​ మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో పాటు నాగర్​కర్నూల్, నారాయణపేట​మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్​రెడ్డి, ఎస్​ రాజేందర్​రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.