న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లో మార్పులకు సంబంధించిన బిల్లుల నివేదికలను పార్లమెంటరీ ప్యానెల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు అందజేసింది. ఈ విషయాన్ని ఉప రాష్ట్రపతి సెక్రటేరియెట్ ట్విట్టర్లో వెల్లడించింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్ లాల్.. పార్లమెంట్లోనే ధన్ఖడ్కు మూడు రిపోర్టులు అందజేశారు. ఇండియన్ పీనల్ కోడ్తో పాటు బ్రిటిష్ హయాం నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను కేంద్రం తొలగించనుంది.
వాటి స్థానంలో కొత్త బిల్లులు రూపొందించి లోక్ సభలో ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ‘ది భారతీయ న్యాయ సంహిత – 2023’ బిల్లును తీసుకొచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో ‘ది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – 2023’ బిల్లును, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘ది భారతీయ సాక్ష్య బిల్లు – 2023’ను రూపొందించింది.