న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా వంటి కంపెనీలు పోయిన నెల బాగానే అమ్మకాలను సాధించాయి. దీంతో ఫిబ్రవరిలో మొత్తం ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు 3.35 లక్షల యూనిట్లను దాటాయి. 2022 ఫిబ్రవరి అమ్మకాల కంటే ఇవి 11 శాతం ఎక్కువ. ఫిబ్రవరి నెలలో ఇంత భారీగా హోల్సేల్స్ ఉండటం ఇదే మొదటిసారి. మారుతీ సుజుకీ ఇండియా ఫిబ్రవరిలో డొమెస్టిక్ హోల్సేల్స్ 11 శాతం పెరిగి 1,55,114 యూనిట్లకు చేరాయి. పోయిన ఏడాది ఇదే నెలలో 1,40,035 యూనిట్లను అమ్మింది. ఆల్టో ఎస్-ప్రెస్సోతో కూడిన మినీ సెగ్మెంట్ కార్ల సేల్స్ 19,691 యూనిట్ల నుంచి 21,875 యూనిట్లకు పెరిగాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ఆర్ సహా కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 77,795 యూనిట్ల నుంచి 79,898 యూనిట్లకు పెరిగాయి. బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్ ఎక్స్ఎల్6తో కూడిన యుటిలిటీ వెహికల్స్ అమ్మకాలు 25,360 యూనిట్ల నుంచి 33,550 యూనిట్లకు పెరిగాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా డొమెస్టిక్ హోల్ సేల్స్ ఇదేకాలంలో 7 శాతం పెరిగి 47,001 యూనిట్లకు చేరుకున్నాయి. తమ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ పోయిన నెలలో 40,181 యూనిట్ల నుంచి 43,140 యూనిట్లకు పెరిగాయని టాటా మోటార్స్ తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం&ఎం) అమ్మకాలు 27,663 యూనిట్ల నుంచి 10 శాతం పెరిగి 30,358 యూనిట్లకు చేరుకున్నాయి. కియా ఇండియా ఫిబ్రవరిలో డొమెస్టిక్ హోల్సేల్స్లో 36 శాతం వృద్ధిని సాధించి 24,600 యూనిట్లను అమ్మింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ హోల్సేల్స్ సంవత్సరానికి 75 శాతం పెరిగి 15,338 యూనిట్లకు చేరుకున్నాయి. టీవీఎస్ మోటార్ ఫిబ్రవరిలో 2,76,150 యూనిట్లను అమ్మింది. పోయిన ఫిబ్రవరితో పోలిస్తే అమ్మకాలు 1.97 శాతం తగ్గాయి. కంపెనీ గత ఏడాది ఇదే నెలలో 2,81,714 యూనిట్లను విక్రయించింది.
