
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి తిరుమల దేవస్థానం తరపున, విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయం తరపున శ్రీశైలం మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల(Brahmotsavam) సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు(Silk cloths) సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం ఆలయ అధికారులు తీర్థ, ప్రసాదాలు అందించారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ(TTD) తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల ఒకటిన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ఫార్పతేధార్ తులసీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. . శ్రీశైలం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున భక్తులకు వసతీ గదులను నిర్మించేందుకు శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సహకరించేందు సిద్దంగా ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డి అన్నారు.శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
అలాగే విజయవాడ దేవస్థానం తరుపున దుర్గమ్మ ఆలయ ఈవో కె.ఎస్.రామారావు, చైర్మన్ రాంబాబు దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న దుర్గమ్మ దేవస్థానం అర్చకులకు ఈవో రామరావు,చైర్మన్ రాంబాబుకు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చక వేదపండితులు పట్టు వస్ర్తాలను తలపై ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు సమర్పించుకున్నారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు.