శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధ‌వారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు.  వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షా బంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ త‌రువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం ఆస్థానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో ధనంజయులు, సూప‌రింటెండెంట్ చెంగ‌ల్రాయులు, ఆల‌య‌ అర్చక బృందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.