Kurnool Bus Tragedy: నిద్రలోనే 20 మంది సజీవదహనం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.

Kurnool Bus Tragedy: నిద్రలోనే 20 మంది సజీవదహనం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.

శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి.   వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ స్లీపర్ బస్సు, జాతీయ రహదారి 44పై  అగ్నిప్రమాదానికి గురైంది.  . హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు బైకును ఢీకొని పూర్తిగా దగ్ధమైంది.  ఘటనలో 20 మందికి పైగా మృతి చెందారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. నిద్రలోనే అమాయక ప్రయాణికులు కాలి బూడిదవడం అత్యంత విషాదాన్ని నింపింది. బంధువుల ఆర్తనాధాలతో సంఘటన స్థలంలో పరిస్థితి అందరిని కలచివేస్తోంది.

పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.. 

ఈ ఘోర అగ్నిప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రైవేట్ ట్రావెల్స్‌కు సంబంధించిన భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయాలని రవాణా శాఖకు సూచించారు.

ALSO READ : మియాపూర్లో బస్సు మిస్సైతే ఛేజింగ్ చేసి మూసాపేట్లో ఎక్కాడు..

 

బస్సు ప్రమాదానికి కారణం ఇదే..

ఈ బస్సు ప్రమాదం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బైకును బలంగా ఢీకొట్టడంతో, బైక్ బస్సు కింద ఇరుక్కుపోయింది. సుమారు 300 మీటర్లు ఈడ్చుకుపోవడంతో, బస్సు ఇంధన ట్యాంక్ పగిలిపోయి డీజిల్ లీకై క్షణాల్లో మంటలు చెలరేగాయి. కేవలం 7-.15 నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉండగా, 12 మందికి పైగా అద్దాలు పగలగొట్టి బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. కొందరు కుటుంబ సభ్యులను రక్షించుకోలేకపోయామని క్షతగాత్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుల్లో బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా ఉన్నారు.

ప్రమాదానికి గురైన ఈ బస్సుపై తెలంగాణలో ఇప్పటికే 16కు పైగా చలాన్లు ఉన్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా, బస్సు ఫిట్‌నెస్ వాలిడిటీ మార్చిలోనే ముగిసినట్లు కూడా సమాచారం. ఈ నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల విషయంలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలు ఈ ఘోర విషాదానికి కారణమయ్యాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. సంబంధిత అధికారులను పంపించి పరిస్థితిపై ఎప్పటికప్పుడు  ఆరా తీస్తున్నారు