వీఆర్ఏలకు  పే స్కేల్ జీవో ఇయ్యలే..

వీఆర్ఏలకు  పే స్కేల్ జీవో ఇయ్యలే..
  • ఆందోళనలో 22 వేల మంది ఉద్యోగులు

కరీంనగర్, వెలుగు : వీఆర్ఏల చిరకాల వాంఛ నెరవేరడం లేదు. వారికి పేస్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి ఆరేండ్లయినా హామీ నెరవేరడం లేదు. పే స్కేల్ జీవో ఇస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్, అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించి ఆరు నెలలవుతున్నా ఇప్పటి వరకు అమలు కావడం లేదు. తమకు పే స్కేల్ అమలు చేయాలని, 55 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలనే డిమాండ్లతో పోయిన ఏడాది జూలై 25 నుంచి అక్టోబర్ 14 వరకు వీఆర్​ఏలు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు, ఆఫీసర్లు.. మునుగోడు ఎలక్షన్ అయిపోగానే జీవో ఇస్తామని హామీ ఇచ్చి 80 రోజులపాటు సాగిన సుదీర్ఘ సమ్మెను విరపమింపజేశారు. సమ్మె ముగిసి ఆరు నెలలైనా ప్రభుత్వం  ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 22 వేల మంది వీఆర్ఏలకు ఎదురుచూపులు తప్పడం లేదు. సెర్ప్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ జీవో ఇచ్చినట్లే తమకు కూడా మార్చి చివరలో పే స్కేల్ జీవో వస్తుందని ఆశించామని, కానీ నిరాశే ఎదురైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
80 రోజుల చారిత్రాత్మక సమ్మె 


సీఎం కేసీఆర్ 2017, ఫిబ్రవరి 24న ప్రగతి భవన్‌‌‌‌లో వీఆర్ఏలతో సమావేశమై వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని తొలిసారిగా హామీ ఇచ్చారు. తర్వాత 2020, సెప్టెంబర్‌‌‌‌లో వీఆర్​వో వ్యవస్థ రద్దు సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని మరోసారి ప్రకటించారు. పే స్కేల్ ఇస్తే ప్రభుత్వంపై అదనంగా రూ.260 కోట్ల భారం పడుతుందని లెక్కలు వేశారు. వృద్ధాప్యంలో ఉన్న వీఆర్ఏలు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్‌‌ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఆందోళనలు నిర్వహించిన వీఆర్ఏలు చివరికి నిరుడు జూలై 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అక్టోబర్ 14 వరకు 80 రోజులపాటు సమ్మె కొనసాగింది. సెప్టెంబర్13న అసెంబ్లీ ముట్టడికి భారీగా వీఆర్ఏలు తరలిరావడం, మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకు దిగడంతో స్వయంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చర్చించారు. అదే నెల 20న మరోసారి అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ సమక్షంలో చర్చలు జరిపారు. సమ్మె విరమించాలని కోరితే.. పే స్కేల్ జీవో ఇచ్చేదాక సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు. అక్టోబర్ నాటికి మునుగోడు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో వీఆర్ఏల సమ్మె ప్రభావం ఉండొద్దనే ఉద్దేశంతో అక్టోబర్14న మరోసారి మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ప్రగతి భవన్ లో వీఆర్ఏ జేఏసీ నాయకులతో సమావేశమయ్యారు. సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని, తమపై నమ్మకం ఉంచాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. మునుగోడు ఎన్నికలు అయిపోగానే డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో వీఆర్ఏలు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఇది జరిగి ఆరు నెలలవుతున్నా పే స్కేల్ జీవో విడుదల చేయడం లేదు. 


డిసెంబర్ 22న ప్రగతిభవన్​ నుంచి  చివరిసారిగా పిలుపు

 
మునుగోడు ఎన్నికలయ్యాక అనేక సార్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం వీఆర్ఏ జేఏసీ నాయకులు ప్రయత్నించారు. గత సంవత్సరం డిసెంబర్ 22న సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావాలని డిసెంబర్ 21న రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పినట్లు జేఏసీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తీరా 22న వెళ్లి పడిగాపులు గాచినా సీఎంను కలిసే అవకాశం రాలేదు. సమ్మె సమయంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్ స్వయంగా పిలిచి మాట్లాడారని.. ఇప్పుడు అడిగితే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.