రూ.750 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న పేటీఎం
న్యూఢిల్లీ: నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్యను 25 కోట్లకు పెంచడానికి వచ్చే మార్చి నాటికి రూ.750 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని డిజిటల్ పేమెంట్స్ సేవల కంపెనీ పేటీఎం ప్రకటించింది. పేటీఎం ఇన్బాక్స్ సర్వీస్ వల్ల కొత్తగా 2.7 కోట్ల మంది యూజర్లు చేరారని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఏడు కోట్లకు పెరుగుతుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబ్బాట్ అన్నారు. ఇన్బాక్స్ సర్వీస్ ద్వారా కంటెంట్ సేవలను అందిస్తున్నారు. పేటీఎంకు ప్రస్తుతం 14 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. త్వరలోనే 300 కోట్ల యూజర్ లాగింగ్ సెషన్లు సాధిస్తామని అన్నారు. పేటీఎంలో అలీబాబా, సాఫ్ట్బ్యాంక్ అంతర్జాతీయ కంపెనీల ఇన్వెస్ట్మెంట్లు ఉన్న విషయం తెలిసిందే. మరింత మందిని ఆకర్షించడానికి త్వరలో న్యూస్, షార్ట్ వీడియోలు, లైవ్ టీవీ వంటి సేవలను వచ్చే ఏడాది నుంచి అందించడానికి పేటీఎం ఏర్పాట్లు చేస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్లు తీసుకునే వ్యాపారుల సంఖ్య రెండు కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు దీపక్ చెప్పారు.