- ట్వీట్ చేసిన ఫౌండర్ విజయ్శేఖర్ శర్మ
న్యూఢిల్లీ : పేటీఎం యూజర్ల ఆందోళనలను తొలగించేందుకు కంపెనీ ఫౌండర్ విజయ్శేఖర్ శర్మ ట్విట్టర్ బాట పట్టారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం పనిచేస్తుందని, ఫ్యూచర్లోనూ పనిచేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 నుంచి బ్యాంకింగ్ సర్వీస్లను అందించడంపై ఆర్బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టింది. రూల్స్ ఫాలో కాకపోవడంతోనే ఈ చర్య తీసుకుంది. కానీ, ఏ రూల్స్ను కంపెనీ ఫాలో కాలేదనే విషయాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఆర్బీఐ రెండూ బయటపెట్టలేదు.
దీంతో పేరెంట్ కంపెనీ పేటీఎం ఆపరేషన్స్పై కూడా దీని ప్రభావం ఉంటుందని చాలా మంది యూజర్లు ఆందోళన పడుతున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో కలిసి అందిస్తున్న పేటీఎం సర్వీస్లను ఇక నుంచి ఇతర బ్యాంక్లతో కలిసి అందిస్తామని విజయ్శేఖర్ శర్మ పేర్కొన్నారు. పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీస్లో ఇండియా దూసుకుపోతుందని, ఈ జర్నీలో పేటీఎం కీలకంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. మరింత స్ట్రాంగ్గా ఎదగడానికి ఇదొక అవకాశమన్నారు.
పేటీఎం షేర్లు మరో 20 శాతం క్రాష్..
ఆర్బీఐ షాకివ్వడంతో పేటీఎం షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ షేర్లు శుక్రవారం సెషన్లోనూ 20 శాతం పడ్డాయి. రూ.487 దగ్గర క్లోజయ్యాయి. కిందటేడాది అక్టోబర్లో రూ.998 దగ్గర 52 వారాల గరిష్టాన్ని కంపెనీ షేర్లు టచ్ చేశాయి. ఈ లెవెల్ నుంచి 51 శాతం తక్కువకు ప్రస్తుతం ట్రేడవుతున్నాయి. మరోవైపు మోర్గాన్ స్టాన్లీ ఓపెన్ మార్కెట్లో రూ.244 కోట్ల విలువైన పేటీఎం షేర్లను శుక్రవారం కొనుగోలు చేసింది.