
- వానాకాలం వడ్లు కొనకుండా యాసంగిపై మాట్లాడుడేంది?: రేవంత్
కామారెడ్డి , వెలుగు: వానాకాలం వడ్లు కొనకుండా యాసంగిలో పండే వడ్లను కేంద్రం కొంటదా? లేదా? అని సీఎం కేసీఆర్ మాట్లాడుడు ఏందని, ముందుగా రోడ్లపై, కల్లాల్లో, సెంటర్లలో కుప్పలుగా పడి ఉన్న వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని పీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. నెల రోజులుగా రోడ్లపై వడ్ల కుప్పలు పోసుకొని రైతులు కష్టాలు పడుతున్నా, ఒత్తిడితో కుప్పలపైనే రైతుల ప్రాణాలు పోతున్నా కేసీఆర్లో చలనం కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను, ఓట్లను ఎంత రేటు పెట్టయినా కొనే కేసీఆర్కు రైతులు పండించిన వడ్లను కొనడం చేతగావడం లేదని రేవంత్ విమర్శించారు. ప్రజాప్రతినిధులను, ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనేటప్పుడు లేని ఓటీపీ సిస్టం రైతుల విషయంలో ఎందుకని ప్రశ్నించారు. రూ. లక్ష రుణ మాఫీ చేస్తానని చెప్పి దాన్ని చేయలేదని, పంట అమ్ముకుంటే వచ్చే సొమ్మును బ్యాంక్ వాళ్లు అప్పు కింద జమ చేసుకుంటున్నారని, దీంతోనే ఓటీపీ సిస్టమ్ పెట్టారని ఆరోపించారు. స్టేట్లో వైన్ షాపుల అప్లికేషన్లకు వచ్చిన రూ. 1,200 కోట్లతో 70 లక్షల టన్నుల వడ్లు కొనవచ్చన్నారు. ‘కల్లాల్లోకి కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లాలో రేవంత్రెడ్డి పర్యటించారు. కల్లాల వద్దకు వెళ్లి వడ్ల కుప్పలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. రైతులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకొవద్దని రేవంత్ విజ్ఞప్తిచేశారు. కామారెడ్డి, లింగంపేటలో మీడియాతో మాట్లాడారు. ప్రగతిభవన్లోనో, గజ్వేల్లోని ఫామ్హౌస్లోనో కేసీఆర్ పడుకోవడం కాదని, కామారెడ్డి జిల్లాకు వచ్చి వడ్ల కుప్పల వద్ద పడుకుంటే రైతుల కష్టాలు తెలుస్తాయన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ లీడర్లను నిలదీయాలె
వడ్లు కొనకుంటే గ్రామాలకు వచ్చే టీఆర్ఎస్, బీజేపీ లీడర్లను రైతులు నిలదీయాలని రేవంత్ అన్నారు. ‘‘పత్తికి గులాబీ చీడ పురుగు పడితే మందు కొట్టాల్సిందే. గట్లనే స్టేట్కు గులాబీ చీడ పురుగు పట్టింది. ఈ పురుగును తొలగించాలంటే టీఆర్ఎస్ వాళ్లను నిలదీయాలె” అని చెప్పారు. ‘‘వానాకాలం వడ్లు కల్లాల్లో ఉంటే వాటిని కొనకుండా కేసీఆర్.. యాసంగిలో వడ్లు కేంద్రం కొంటదా ? లేదా? అంటూ ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేయడం ఏంది? కేసీఆర్ ధర్నా చేయాల్సింది ఇందిరా పార్కు దగ్గర కాదు.. ప్రధాని మోడీ ఇంటి ముందు చేయాలె. వస్తానంటే మేమే స్వయంగా ఢిల్లీ తోల్కపోయి కూర్చోబెడుతం” అని చెప్పారు. కాళేశ్వరం కమీషన్లో, మిషన్భగీరథ కింద దోచుకున్న సొమ్మునో, హైదరాబాద్లో ఆక్రమించిన భూముల పైసలో రైతులు అడగడం లేదని, వడ్లు కొనుమంటున్నారని అన్నారు. వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ వీధి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉండేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కలిసి డ్రామా యాక్షన్ అనే కొత్త కంపెనీని తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. వడ్లను ఎఫ్సీఐతో కొనిపించలేని సంజయ్ నల్గొండకు పోయి ఏం చేశారో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. రైతులతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బతికి బట్టకట్టలేదని, ఇప్పుడు కేసీఆర్ రైతులతో పెట్టుకున్నారని అన్నారు. సాగు చట్టాల రద్దుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతుల విజయమని చెప్పారు. హర్యానా, పంజాబ్ రైతులను స్ఫూర్తిగా తీసుకొని మన రైతులు పోరాటం చేయాలనిపిలుపునిచ్చారు. మన రాష్ట్ర రైతుల సమస్యలపై ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీని నిలదీస్తామని తెలిపారు. అసెంబ్లీలోనూ పోరాటం చేస్తామన్నారు.
రైతులకు ఆర్థిక సాయం
వడ్ల కుప్ప వద్ద చనిపోయిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్కు చెందిన రైతు బీరయ్య కుటుంబానికి రూ. లక్ష, నల్లమడుగుకు చెందిన రైతు నరేందర్ పంట కుప్ప వద్ద పాము కాటుతో చనిపోగా ఆయన ఫ్యామిలీకి రూ.లక్ష చొప్పున రేవంత్ ఆర్థిక సాయం అందజేశారు. రేవంత్తో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే గంగారాం తదితరులు పాల్గొన్నారు.