- రాష్ట్రంలో సమస్యలపై పోరుబాట పట్టాలని నిర్ణయం
- బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు.
- బీజేపీ అధికార దాహాన్ని తిప్పికొడుతాం
- పదవీ త్యాగాలకు సోనియా రాహుల్ మారుపేరు
- గాంధీ ఫ్యామిలీని అవమానిస్తున్నారు
- దేశ సమగ్రత కాపాడేందుకు గాంధీ కుటుంబం పత్రిక పెట్టింది
గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్టే.. ప్రతి కార్యకర్త స్పందించాలన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగట్లేదు. ఈడీ నోటీసులిచ్చి గాంధీ ఫ్యామిలీని భయపెట్టాలని చూస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట ఈనెల 13న నిరసన తెలిపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి బషీర్ బాగ్ ఈడీ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టాలన్నారు. ఈనెల 15న నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్ కు టీఆర్ఎస్, బీజేపీ నేతలను ఆహ్వానిస్తామన్నారు.
ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట పాదయాత్ర చేయడం జరుగుతుందని.. రాహుల్ బయటకు వచ్చే వరకు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఈడీ ఆఫీసుల ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు.
సుబ్రమణ్య స్వామి తప్పుడు కేసు పెట్టారన్నారు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం జరగలేదని, నేషనల్ హెరాల్డ్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలో నుంచి దిగిపోయిన అనంతరం.. ఆర్థిక లావాదేవీలు ఇంకో సంస్థకు బదలాయింపు చేశారని.. 2015లో కేసు క్లోజ్ చేయడం జరిగిందని వివరించారు. కాంగ్రెస్ ను వేధింపులకు గురి చేయడానికి మళ్లీ కేసును ఓపెన్ చేసి.. నోటీసులు ఇచ్చారని విమర్శించారు. నేరానికి పాల్పడిన సొమ్ము చేతులు మారినప్పుడే ఈడీ విచారణ చేసే అవకాశం ఉందని.. కానీ అలాంటిది నేషనల్ హెరాల్డ్ పత్రికలో జరగలేదన్నారు. పత్రికను మూయించాలనే ఉద్దేశ్యంతో అక్రమ కేసులు పెట్టారన్నారు. సోనియా, రాహుల్ ఈడీ అధికారుల ఎదుట హాజరవుతారన్నారు. అమిత్ షా కుట్రలను ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొట్టాలని సూచించారు రేవంత్ రెడ్డి.