- 19 శాతం తటస్థ ఓట్లు మాకే: పీసీసీ చీఫ్ రేవంత్
- ఓట్లు చీల్చేందుకే మోదీ రాష్ట్రానికొచ్చారని విమర్శ
- బీఆర్ఎస్కు 25 సీట్లు దాటే చాన్స్ లేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్లో బీసీలకు టికెట్లు ఇప్పించేందుకు తాను కొట్లాడుతానని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. సర్వేల్లో ఓసీ అభ్యర్థుల కంటే 2 శాతం తక్కువగా ఉన్నా, బీసీలకు టికెట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. సోమవారం గాంధీ భవన్లో ప్రెస్మీట్ నిర్వహించిన రేవంత్.. ఆ తర్వాత రిపోర్టర్లతో చిట్చాట్ చేశారు.
బీసీలకు టికెట్ల అంశాన్ని రిపోర్టర్లు ప్రస్తావించగా.. బీసీలు ఎక్కువ టికెట్లు అడగడంలో తప్పు లేదని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ ఇచ్చినదాని కంటే ఎక్కువ సీట్లు బీసీలకు కేటాయిస్తామన్నారు. అభ్యర్థుల పేర్లు కూడా రెడీ అయ్యాయని, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అనంతరం, ఏఐసీసీ ఆమోదం తెలపగానే ప్రకటిస్తామన్నారు. బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని, 25 సీట్లకు మించి ఆ పార్టీ గెలవలేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 19 శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ కాలేదని, అందులో మెజారిటీ శాతం కాంగ్రెస్కే పడ్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ మేనిఫెస్టోలో మరిన్ని ఆయుధాలను పెట్టబోతున్నామని రేవంత్ వెల్లడించారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఎన్ని బూటకపు హామీలు ఇచ్చినా కేసీఆర్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఓట్లు దండుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని రేవంత్ విమర్శించారు. ఎన్టీఆర్తో పోల్చుకునే అర్హత కేటీఆర్కు, కేసీఆర్కు లేదన్నారు.
కేసీఆర్, మోదీ ఒక్కటే
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న విషయం మరోసారి రుజువైందని రేవంత్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో సభలు పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటకు తీస్తామని ప్రజలకు ఎందుకు హామీ ఇవ్వలేదో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం దోపిడీ, లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు.
మోదీ ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు పాత హామీలేనని రేవంత్ గుర్తు చేశారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్ వంటి అంశాలను మోదీ ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ప్రకటన చేస్తారని భావించిన ప్రజల ఆశలపై మోదీ నీళ్లు చల్లారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టిన మోదీ, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారనుకోవడం అవివేకమే అవుతుందని రేవంత్ అన్నారు.
మరిన్ని స్కీమ్లు ఉంటయి
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని రేవంత్ అన్నారు. మరిన్ని స్కీమ్లను తమ మేనిఫెస్టోలో ప్రకటిస్తామన్నారు. ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, మైనారిటీ రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన పథకాలు ఉండవని, రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆదాయాన్ని బట్టి పథకాలు ఉంటాయన్నారు.