న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలంటూ కామెంట్ చేసిన సీఎం కేసీఆర్పై దేశద్రోహం కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీలను పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. గిరిజన, దళిత, బలహీన వర్గాలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ ఆలోచనలను కేసీఆర్ ద్వారా మాట్లాడించారని మండిపడ్డారు. కేసీఆర్ కామెంట్లకు నిరసగా పార్లమెంట్లోని అంబేద్కర్ విగ్రహం ముందు రేవంత్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ‘రాజ్యాంగాన్ని రక్షించండి..- కేసీఆర్ను శిక్షించండి’అంటూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. కేసీఆర్ కామెంట్లను రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధాని మోడీల దృష్టికి తీసుకెళ్లేందుకు పార్లమెంట్లో దీక్షకు దిగినట్లు రేవంత్ చెప్పారు. ఇదే అంశంపై మంగళవారం లోక్సభలో వాయిదా తీర్మానాలు ఇస్తామని తెలిపారు. తాజాగా రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు రాజ్యాంగం మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించిందని గుర్తుచేశారు. ఈ విషయంలో సీఎంపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ధర్నాలో ఎంపీలు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్లు పాల్గొన్నారు.
ఆర్థిక శాఖ పరిశీలనలో ట్రైబల్ వర్సిటీ: కేంద్రం
ఏపీ విభజన చట్టంలో పొందుపరిచినట్లు తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని కేంద్రం వెల్లడించింది. వర్సిటీ యాక్టివిటీస్ ప్రారంభమయ్యాక యూజీసీ నిధులు కేటాయిస్తుందని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్ తెలిపారు. లోక్సభలో సోమవారం ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర విద్యా శాఖ ఏర్పాటు చేసిన సైట్ సెలెక్షన్ కమిటీ ములుగులో వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని చెప్పారు.