భూ దందాలకు కేరాఫ్ బీజేపీ: పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి

భూ దందాలకు కేరాఫ్ బీజేపీ: పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
  • మతంపేరుతో ప్రజలు మధ్య చిచ్చు
  • కేసీఆర్ ఎన్నడైనా పెట్టుబడుల కోసం విదేశాలకు పోయిండా?
  • పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్: భూ దందాలకు కేరాఫ్ బీజేపీ అని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటీ? అని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేస్తే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని ఫైర్​అయ్యారు. గాంధీభవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం అమెరికాలో పర్యటిస్తుంది. గత సర్కార్ కాకి లెక్కలతో కోట్ల రూపాయలను దోచుకుంది.

గతంలో సీఎంగా అన్న కేసీఆర్ ఎప్పుడైనా పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేశారా? స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉపాధి. ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. బీజేపీ, మోదీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. కేంద్రం పదేండ్లు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. ధర్మంపేరుతో బీజేపీ నేతలు భూ కుంభకోణాలు చేస్తున్నారు. రక్షణ భూములను కొట్టేశారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో భూదందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. పాదయాత్ర పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే కదా ఆయన్ను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తప్పించింది. మతంపేరుతో రాష్ట్రంలో ప్రజలు మధ్య చిచ్చుపెడుతున్నారు’ అన్నారు.