టీపీసీసీ చీఫ్ ఎవరైనా పూర్తిగా సహకరిస్తానని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ నేతృత్వంలో గాంధీ భవన్ లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తన అభిప్రాయం చెప్పలేదన్నారు. పార్టీ అధినేత్రి నిర్ణయమే తన నిర్ణయమన్నారు. అంతేకాదు…సమావేశం ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి… ఉత్తమ్ కుమార్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. దీంతో టీపీసీసీ బాధ్యతలు ఆయనకే దక్కవచ్చని, ఈ విషయం ముందే ఉత్తమ్ కు తెలిసిపోయిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
GHMC ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పదవికి పలువురు కాంగ్రెస్ నేతల పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, వీహెచ్ సహా పలువురు ఆశావహులు టీపీసీసీ బాధ్యతల కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక నిమిత్తం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ నేతృత్వంలో గాంధీ భవన్ లో కోర్ కమిటీ సమావేశం జరుగగా, తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను సోనియా గాంధీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.