
- ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా కృషి చేయాలి: వివేక్
- ఉప ఎన్నిక సన్నద్ధతపై కాంగ్రెస్ కీలక సమావేశం
హైదరాబాద్సిటీ, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ఉపఎన్నిక సన్నద్ధత పై ఏఐసీసీ ఇన్చార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ శనివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుతో కీలక సమావేశం నిర్వహించారు.
ప్రజా భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు గుర్తించిన సమాచారాన్ని జూబ్లీ హిల్స్ యూసుఫ్ గూడ డివిజన్ ఇన్చార్జ్ లు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్టీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మంత్రులకు అందజేశారు.
బూత్ లెవల్ కమిటీ సభ్యులతో జరిపిన సమీక్షా సమావేశాల రిపోర్ట్ ను వారు వివరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను చైతన్య పరుస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా మంత్రిపొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కొత్త రేషన్కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలు ఇంటింటా ప్రచారం చేయాలన్నారు.
జూబ్లీహిల్స్లో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆరు వేల కార్డులు ఇచ్చామని, 20వేల మంది కొత్తగా నమోదుచేసుకున్నారని అన్నారు. ప్రతి బూత్కి ఒక ఇన్చార్జ్ ఉండాలన్నారు. మీకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అధికారంలో ఉన్న పార్టీనీ గెలిపిస్తే నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలి: మంత్రి వివేక్
జూబ్లీహిల్స్లోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని ఈసందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శానిటేషన్, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ రోడ్ల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి పరిష్కారానికి నియోజకవర్గ నాయకులు ముందుకు రావాలన్నారు. నియోజక వర్గంలో డివిజన్ కార్యాలయాలు ప్రారంభించుకోవాలన్నారు. బూత్ ల వారీగా రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలన్నారు.