ఎంపీల సస్పెన్షన్..​ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : మల్లు రవి

ఎంపీల సస్పెన్షన్..​ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : మల్లు రవి
  • పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్​లో ఎంపీల ను సస్పెండ్​ చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి అన్నారు. 79 మంది ఎంపీలను ఒకేరోజు సస్పెండ్​ చేయడం పార్లమెంట్​ చరిత్రలో తొలిసారన్నారు. అది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ అని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆగంతకులు పార్లమెంట్​ లోపలికి వెళ్లి దాడి చేయడం ఘోరమైన ఘటన అని, ఇంకేమైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

‘‘పార్లమెంట్​ భద్రతపై చర్చించేందుకు ఎందుకు జంకుతున్నారు? కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఎందుకు స్పందించడం లేదు? వికసిత్​ భారత్​ అంటే ఇదేనా?’’ అని ఆయన నిలదీశారు. ఇలాంటి ఘటనల పట్ల బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. పార్లమెంట్​పై ఉగ్రవాదులు దాడి చేసిన రోజే అలాంటి ఘటన జరగడం భద్రతా వైఫల్యమేనన్నారు. దానిపై పార్లమెంట్​లో చర్చ జరగాలని, ప్రజలందరికీ తెలియాలని మల్లు రవి డిమాండ్​ చేశారు.