పెద్దపల్లి కాంగ్రెస్​లో గ్రూపులు

పెద్దపల్లి కాంగ్రెస్​లో గ్రూపులు
  • ఎవరికి వారుగా చీలిన లీడర్లు
  •  ప్రోగ్రాం ఏదైనా సొంతంగానే ముందుకు 
  •  ఎవరి వెనుక నడవాలో కన్ఫ్యూజన్​లో క్యాడర్​

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్​లో వర్గపోరుతో లీడర్లు రోడ్డెక్కుతున్నారు. ఇప్పటి నుంచే టిక్కెట్​మాదే అంటే మాదే అని బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఎవరి వెనుకాల నడవాలో అర్థంకాక క్యాడర్​కన్ఫ్యూజన్​లో ఉంది. 
 

పార్టీలో వర్గపోరు 
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్​లో వర్గపోరు నడుస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గంలో తనకే టికెట్​వస్తుందని లీడర్లు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ నిర్వహిస్తున్న రచ్చబండ  ప్రోగ్రాంను నియోజవర్గంలో మాజీ  ఎమ్మెల్యే విజయరమణరావు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రమేయం లేకుండా పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారని కొమురయ్య వర్గం విజయరమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  ఓదెల జడ్పీటీసీ గంటరాములు చింతన్​ బైఠక్​ తీర్మానాల దృష్ట్యా టిక్కెట్​ తనకే వస్తుందని ఆశిస్తున్నారు. విజయరమణరావు పీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డిని నమ్ముకుంటే, గంట రాములు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్లను నమ్ముకున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య మాత్రం కాంగ్రెస్​లో తానే సీనియర్​నని, సీటు తనకేనన్న ఆశతో ఉన్నారు. ఇలా గ్రూపులుగా విడిపోయి, వేర్వేరుగా ప్రోగ్రామ్ లు చేస్తున్నారు. దీంతో క్యాడర్​డైలమాలో పడిపోయింది. ఎన్నికల నాటికి ఇదే విధంగా ఉంటే పార్టీ మరోసారి దెబ్బతినక తప్పదని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 లో మొదటిసారి జరిగిన ఎలక్షన్​లో కాంగ్రెస్​ నుంచి ముకుందరెడ్డి టికెట్​రేసులో ఉన్నారు. అనూహ్యంగా భానుప్రసాదరావు టికెట్​దక్కించుకున్నారు. టికెట్​దక్కని ముకుందరెడ్డి కొంతకాలానికి మరణించారు. టికెట్​ రాకపోవడం వల్లనే ఆయన చనిపోయారన్న అసంతృప్తి క్యాడర్​లో గూడుకట్టుకుంది. ఇదే ఆ ఎలక్షన్​లో ఓటమికి కారణమైందని విశ్లేషణలున్నాయి. 
 

2018 ఎలక్షన్​లోనూ అదే తీరు.. 
2014లో ఓడిపోయిన భానుప్రసాదరావు టీఆర్ఎస్​లో చేరారు. టీడీపీ నుంచి ఓడిపోయిన విజయరమణారావు కాంగ్రెస్​లో చేరారు. ముకుందరెడ్డి కోడలు సవితరెడ్డి, గొట్టిముక్కుల సురేశ్ రెడ్డి, ఈర్ల కొమురయ్యతో పాటు పలువురు సీనియర్లు 2018లో టికెట్​ ఆశించారు. కానీ హైకమాండ్​ విజయరమణారావును బరిలో నిలిపింది. దీంతో ముగ్గురు నాయకులు హైకమాండ్​పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సవితారెడ్డి, సురేశ్​రెడ్డి పార్టీ క్యాండెట్​అయిన విజయరమణారావుకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు అంతకన్నా తీవ్రంగా గ్రూప్​ పాలిటిక్స్​ నడుస్తున్నాయి.  కాంగ్రెస్​ బలం పుంజుకుంటున్న క్రమంలో చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు. పెద్దపల్లి పరిస్థితిపై హైకమాండ్​ఫోకస్​ చేయాలని, జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టాలని లీడర్లు, క్యాడర్​ కోరుతున్నారు. రామగుండం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మక్కాన్​సింగ్​ టిక్కెట్​తనదే అనే ధీమాతో ఉన్నారు. 2018 లో రామగుండం నియోజకవర్గంలో మక్కాన్​సింగ్​రాజ్ ఠాకూర్​కు కాంగ్రెస్​లో ఎవరూ పోటీ లేరు. కానీ ప్రస్తుతం ​ఐన్​టీయూసీ లీడర్​జనక్​ ప్రసాద్​తో పాటు హర్కర వేణుగోపాల్​లు పోటీ పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం రామగుండం కార్పొరేటర్లు కొందరు సమావేశాలు పెట్టి తామంతా ఠాకూర్​ వెనుకున్నామని హైకమాండ్​కు ఇండికేషన్​ఇచ్చారు. మరోవైపు జనక్​ప్రసాద్​వర్గం సైతం మీటింగ్​లు పెడుతోంది. మంథనిలో శ్రీధర్ బాబుకు పోటీ లేకపోవడంతో ఆయన తన పని మీద ఫోకస్​ చేశారు.