ఏ మతమైనా, ఏ కులమైనా మనమంతా మొదటగా భారతీయులమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలోని హోలీ ట్రినిటీ చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లోమంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాను చిన్నప్పుడు సెయింట్ పాట్రిక్ స్కూల్లోనే చదువుకున్నానని, అందువల్ల తనకు క్రైస్తవ పద్ధతులు, వారి ప్రార్థనల పట్ల పూర్తి అవగాహన, గౌరవం ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పవిత్రమైన రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.ప్రస్తుత దేశ పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత అరవై సంవత్సరాలుగా మన దేశంలో ఎంతో గొప్పగా విలసిల్లిన మత సామరస్యం... ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తోందని ఆందోళన చెందారు. కేవలం చిన్న చిన్న అపార్థాల కారణంగానే ప్రస్తుతం దేశంలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.
.భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలం అన్న ఆయన... మనకు వచ్చే సమస్యలను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రజలందరూ అపార్థాలను వీడి, ఐకమత్యంతో, సోదరభావంతో జీవించినప్పుడే దేశం మరింత ముందుకు వెళ్తుందని వంశీకృష్ణ స్పష్టం చేశారు.
