- సెమీకాన్ 2.0కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- మొబైల్ ఫోన్ల తయారీ పెంచేందుకు రూ.62,500 కోట్లతో కొత్త స్కీమ్
- 60 వేల మందికి ఉపాధి
- దొరుకుతుందని అంచనా
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్స్, చిప్ల తయారీని మరింత పెంచేందుకు కేంద్రం బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.1.90 లక్షల కోట్ల విలువైన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. రూ. 1,27,500 కోట్లతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం 2.0 లేదా సెమీకాన్ 2.0)కి ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ. 62,500 కోట్ల కేటాయింపుతో సరికొత్త మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ఎంపీఎంస్) కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. మొత్తం రూ. 2.19 లక్షల కోట్ల విలువైన ఏడు కీలక నిర్ణయాలను తీసుకోగా, ఈ రెండు రంగాలపై ఎక్కువ ఫోకస్ ఉంది. వీటితో పాటు యూరియా తయారీని పెంచేందుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
సెమీకాన్ 2.0
సెమీకాన్ 1.0 సక్సెస్ అవ్వడంతో , ప్రభుత్వం సెమీకాన్ 2.0 ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆరు విభాగాలను డెవలప్ చేయనున్నారు.
చిప్ డిజైన్: సెమీకాన్ 1.0 లో 105 స్టార్టప్లు చిప్ డిజైన్ ప్రారంభించగా, తాజా మిషన్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ), పూర్తిస్థాయి చిప్ సిస్టమ్స్ డెవలప్ చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది.
మెషీనరీ, మెటీరియల్స్: చిప్ తయారీకి అవసరమైన కెమికల్స్, గ్యాస్, స్పెషల్ మెటీరియల్స్, మెషినరీల తయారీని లోకల్గా ప్రోత్సహిస్తారు.
సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్స్: సిలికాన్ ఫ్యాబ్లు, డిస్ప్లే ఫ్యాబ్లతో పాటు ఇతర అడ్వాన్స్డ్ చిప్ తయారీ ప్లాంట్ల కోసం పెట్టుబడులను ఆకర్షించడం.
ప్యాకేజింగ్ రంగానికి మద్దతు: అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ), ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓఎస్ఏటీ) ని మరింత బలోపేతం చేయడానికి కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు అందించనుంది.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ : గ్లోబల్ టాప్ ఆర్ అండ్ డీ సెంటర్లతో కలిసి 28నానోమీటర్స్ (ఎన్ఎం)– 110 ఎన్ఎంకి మించి మరింత అడ్వాన్స్డ్ చిప్ టెక్నాలజీలపై రీసెర్చ్ చేయడంపై ఫోకస్ పెంచనుంది.
ట్యాలెంట్ డెవలప్మెంట్: ఇప్పటికే 315 యూనివర్సిటీలలో 68 వేల మంది విద్యార్థులకు చిప్ డిజైన్ టూల్స్పై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణను మరింత లోతుగా మార్చి, ప్రొఫెషనల్స్ను తయారు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
సెమీకాన్ 1.0 సక్సెస్
తొలి దశ సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.64 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 12 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒక సిలికాన్ ఫ్యాబ్, ఒక సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్, గాలియం నైట్రైడ్ మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాబ్తో పాటు 9 ప్యాకేజింగ్ ప్లాంట్లు ఉన్నాయి. మైక్రాన్, కేన్స్, సీజీ సెమీ వంటి సంస్థలు ఇప్పటికే ఉత్పత్తినిప్రారంభించాయి.
మొబైల్ తయారీకి రూ.62,500 కోట్లు
లోకల్గా స్మార్ట్ఫోన్ల తయారీని మరింత పెంచేందుకు కేబినెట్ రూ. 62,500 కోట్ల కొత్త స్కీమ్ను తీసుకొచ్చింది. ఎంపీఎంఎస్ రాబోయే 5 ఏళ్ల పాటు (2026–27 నుంచి 2030–31 వరకు) అమలులో ఉంటుంది. భారతదేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్ల అమ్మకాలపై 2.25శాతం నుంచి 5శాతం వరకు ప్రోత్సాహకాలు ఇస్తారు. కీలకమైన కాంపోనెంట్లను స్థానికంగా సేకరిస్తే అదనంగా మరో 1.5శాతం ప్రోత్సాహకం లభిస్తుంది.
చిప్ డిజైనింగ్, సొంత రీసెర్చ్ చేసే స్వదేశీ మొబైల్ బ్రాండ్లకు ఏకంగా 3శాతం ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. ఈ స్కీమ్ ద్వారా సుమారు రూ. 39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఉత్పత్తి జరిగి, ఎగుమతులు భారీగా పెరుగుతాయని, అలాగే 60 వేల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
