హుజూరాబాద్​లో 57 ఏండ్లు దాటినోళ్లకు పింఛన్

హుజూరాబాద్​లో 57 ఏండ్లు దాటినోళ్లకు పింఛన్

హుజూరాబాద్,​ వెలుగు: హుజూరాబాద్ డివిజన్ పరిధిలో 57 సంవత్సరాలు దాటి  వృద్ధాప్య పింఛనుకు అర్హులైనవారి జాబితాను సిద్ధం చేయాలని కరీంనగర్​జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.     గురువారం హుజూరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో డివిజన్ పరిధిలోని మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల ఎంపిక, వ్యాక్సినేషన్, గొర్రెల కోసం డీడీలు కట్టనివారి వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండినవారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆసరా పింఛన్లు పొందుతున్న వారిలో  చనిపోయిన వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించాలన్నారు.  డివిజన్ లో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. హుజూరాబాద్ డివిజన్ లో ఈ నెల 28న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని జమ్మికుంటలో ప్రారంభిస్తారన్నారు. గొర్రెల యూనిట్లు పంపిణీకి ఇంకా డీడీలు చెల్లించని వారి వివరాలను గ్రామాలవారీగా సేకరించి వెంటనే డీడీలు కట్టించాలన్నారు.