ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పరిణామాలెలా ఉంటాయి ? ఎవరు గెలుస్తున్నారు ?

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పరిణామాలెలా ఉంటాయి ? ఎవరు గెలుస్తున్నారు ?

ఇజ్రాయెల్, ఇరాన్.. రెండు దేశాలు పురాతన నాగరికతలను కలిగి ఉన్నాయి. అయితే,  ఇజ్రాయెల్, ఇరాన్  ఇరుగు పొరుగు దేశాలు కాదు.  అయినప్పటికీ ఆ రెండు దేశాల మధ్య అత్యంత తీవ్రమైన యుద్ధం ప్రారంభమైంది. సాధారణంగా, ప్రపంచంలో ఏ దేశాల మధ్య జరిగే యుద్ధాలైనా ఆ దేశాలకు సంబంధించిన భూమి కోసం ప్రారంభమవుతాయి. కానీ, ఇరాన్,  ఇజ్రాయెల్ మధ్య 1980 నుంచి ఇతర సమస్యలపై శత్రుత్వం ఉంది. 

ఇజ్రాయెల్‌‌‌‌తో ఇరాన్ శత్రుత్వం ఒకవిధంగా మతపరమైన రూపం కూడా సంతరించుకుంది. 1980 వరకు ఇరాన్​లో  రాచరిక పాలన కొనసాగింది. 1980 తర్వాత  సంప్రదాయవాద షియా ఇస్లాం మతాధికారులు ఇరాన్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో1980 నుంచి ఇరాన్ ఇజ్రాయెల్‌‌‌‌పై  తీవ్ర శత్రుత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభమైంది. ఇజ్రాయెల్  ముస్లింలతో పోరాడుతున్నందున ఇజ్రాయెల్‌‌‌‌ను నాశనం చేస్తామని ఇరాన్​ ఎల్లప్పుడూ బహిరంగంగానే హెచ్చరిస్తుంటుంది. 

ఇరాన్ విస్తారమైన చమురు వనరులను కలిగి ఉంది. ఇజ్రాయెల్‌‌‌‌పై దాడి చేయడానికి  చమురు వనరుల ద్వారా భారీగా లభించే డబ్బును ఉపయోగిస్తోంది. కానీ, సున్నీ అరబ్ దేశాలు ఇరాన్‌‌‌‌కు  సహకరించవు. ఇరాన్ ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించాలని కోరుకుంటోంది. ఆయుధాల సమీకరణలో నిత్యం బిజీగా ఉంటుంది. లెబనాన్, యెమన్, గాజా,  సిరియాలో మిలీషియాలను సృష్టిస్తోంది. ఈ పరిణామం సౌదీ అరేబియా, ఈజిప్ట్, కువైట్, ఖతార్, యూఏఈ, జోర్డాన్ వంటి సున్నీ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఆయా దేశాలు ఇరాన్‌‌‌‌ యత్నాలను వ్యతిరేకిస్తాయి. 

ఇజ్రాయెల్ చరిత్ర
యూదులు చాలా పురాతన నాగరికతను కలిగి ఉండటంతోపాటు తెలివితేటలు, సంపదను కలిగి ఉన్నవారిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు పొందారు. వేల ఏళ్ల క్రితం నుంచి యూదులు ప్రస్తుత అరబ్ ప్రాంతాలలో నివసిస్తున్నారు. యుద్ధాలు, హింస కారణంగా యూదులు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురు అయ్యారు. 1918లో బ్రిటన్  ‘ది బాల్ఫోర్ డిక్లరేషన్​’ను ప్రకటించింది. ఇది యూదుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇచ్చింది. 1948లో అప్పట్లో సూపర్-పవర్‌‌‌‌గా ఉన్న బ్రిటన్, ఇజ్రాయెల్ కోసం ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. దీంతో 1948 నుంచి అరబ్  దేశాలు ఇజ్రాయెల్‌‌‌‌పై పోరాటం చేశాయి.

ఇజ్రాయెల్​పై జరిగిన అన్ని యుద్ధాలలోనూ అరబ్​ దేశాలు ఓటమిపాలయ్యాయి. అయితే, ప్రస్తుతం ఆ దేశాలు ఇజ్రాయెల్​పై  తమ వ్యతిరేకతను తగ్గించాయి. కానీ,  ఇరాన్  మాత్రం ఇజ్రాయెల్పై పోరాటానికి నాయకత్వం వహించి ఇజ్రాయెల్‌‌‌‌కు అతిపెద్ద శత్రువుగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్‌‌‌‌ను నాశనం చేస్తామని బహిరంగంగా చాలాసార్లు ప్రకటించింది. ఇరాన్  న్యూక్లియర్​ సైన్స్​ను అభివృద్ధి చేస్తోంది. ఇరాన్ వద్ద ఇప్పటికే అణుబాంబులు ఉన్నాయని ఇజ్రాయెల్​తోపాటు అగ్రరాజ్యం అమెరికా కూడా అనుమానిస్తోంది.

ఇరాన్‌‌‌‌పై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి
ఇరాన్  అణుబాంబులను కొనుగోలు చేస్తుందని,  ఇజ్రాయెల్‌‌‌‌పై దాడిచేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ గత 20 సంవత్సరాలుగా హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని  ఇరాన్‌‌‌‌పై తీవ్ర యుద్ధానికి దూకుడుగా దిగారు. మరోవైపు అణు బాంబులను అభివృద్ధి చేయడాన్ని నియంత్రించడానికి అమెరికా ఇరాన్‌‌‌‌తో చర్చలు జరుపుతోంది.  ఈక్రమంలో అకస్మాత్తుగా జూన్ 13, 2025న ఇజ్రాయెల్ ఊహించని రీతిలో ఇరాన్‌‌‌‌పై  ప్రాణాంతక దాడిని ప్రారంభించింది.  ఇజ్రాయెల్​ ప్రధాని  నెతన్యాహు భీకరయుద్ధానికి ఏమాత్రం వెనుకాడకుండా కఠిన నిర్ణయాలతో తమ శత్రుదేశాలపై విరుచుకుపడుతున్నారు.

నెతన్యాహు ఆదేశాల  మేరకు 15 నెలల పాటు గాజాపై బాంబు దాడులు జరగటంతో  గాజా పూర్తిగా నాశనమైంది. జూన్ 13, 2025న ఇరాన్‌‌‌‌పై  దాడి చేయడం  ద్వారా ఇజ్రాయెల్  ప్రపంచ దేశాలకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది.  అమెరికా కూడా ఇజ్రాయెల్​ ఇరాన్​పై  దాడి చేస్తుందని ఊహించలేదు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నందున, ఆ రెండు దేశాల మధ్య తదుపరి సమావేశం జూన్ 15, 2025న జరగాల్సి ఉన్నందున  ఇజ్రాయెల్​ దాడి చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అది  ఇరాన్‌‌‌‌కు షాక్ ఇచ్చింది. 

టాప్ ​జనరల్స్ను కోల్పోయిన ఇరాన్​
అమెరికా, ఇరాన్​ మధ్య చర్చల గడువుకు ముందు ఇజ్రాయెల్ గొప్ప ట్రిక్ ప్లే చేసి జూన్ 13, 2025న ఇరాన్​పై దాడి చేసింది. అమెరికాతో చర్చలు జరుగుతున్నందున ఇరాన్  కూడా ఇజ్రాయెల్​ దాడిని ఊహించలేకపోయింది. ఇజ్రాయెల్​ను అంచనా వేయడంలో  ఇరాన్  ఘోరంగా విఫలమైంది. ఇజ్రాయెల్ ఆకస్మిక దాడిచేసి ఇరాన్​కు చెందిన టాప్​ జనరల్స్, వైమానికదళ అధిపతి, రక్షణమంత్రి, అగ్రస్థాయి అణుశాస్త్రవేత్తలు, ఇరాన్ చీఫ్ ఖమేనీకి దగ్గరగా ఉన్న జనరల్స్‌‌‌‌ను  చంపింది.

ఇరాన్​ జనరల్స్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించకపోవడంతో తమ ప్రాణాలను కోల్పోయారు. ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చాలా విధ్వంసం సృష్టించింది. ఇరాన్  స్థైర్యం కుప్పకూలింది, ఎందుకంటే, ఇరాన్​ అగ్ర నాయకులు ఎవరూ మిగిలిలేరు. ఇరాన్​ వైమానిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, క్షిపణులను నిల్వ చేసిన ఇతర సైనిక స్థావరాలను కూడా ఇజ్రాయెల్​ నాశనం చేసింది. ఇజ్రాయెల్ ధైర్యానికి, ఇరాన్​పై ఆకస్మిక దాడికి ప్రపంచం ఆశ్చర్యపోయింది. యుద్ధంలో ఆశ్చర్యం సాధారణంగా గెలుస్తుంది.

ఇరాన్, ఇజ్రాయెల్​ ఎవరు గెలుస్తున్నారు ?
ఇజ్రాయెల్ ఆశ్చర్యకరమైన దాడి ద్వారా మొదటి రౌండ్ గెలిచిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు  రెండవ రౌండ్ యుద్ధం జరుగుతోంది. యుద్ధ ఫలితం వచ్చేవరకు ఇజ్రాయెల్ తమ  డెడ్లీ అటాక్​ను ఆపదు. ఇరాన్ ప్రజలు షియా మతాధికారుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని,  ఇరాన్​ వార్​ మెషిన్​ను దెబ్బతీయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇరాన్‌‌‌‌కు ఇదొక పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పటివరకు అందరూ ఇరాన్‌‌‌‌కు భయపడేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం పూర్తిగా అసమర్థ ప్రభుత్వాన్ని చూస్తోంది. ఇరాన్​ పూర్తిస్థాయిలో ఇజ్రాయెల్​పై యుద్ధానికి సిద్ధంగా లేదని ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇరానియన్లు కూడా తమ ప్రభుత్వ అసమర్థత, మూర్ఖత్వంతో షాక్‌‌‌‌కు గురవుతున్నారు. ఇరాన్‌‌‌‌ను ఆశ్చర్యపరిచి ఆ దేశానికి చెందిన సైనిక జనరల్స్ అందరిని చంపేశారనే వాస్తవం ఇరానియన్లను షాక్​కు గురిచేసింది.  ప్రస్తుత  షియా మతాధికారుల ప్రభుత్వం ఇమేజ్ తీవ్రంగా దెబ్బతిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పుడు ఏం జరుగుతుంది?
అమెరికా  ఇజ్రాయెల్‌‌‌‌కు మద్దతు ఇస్తుంది. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఇప్పుడు  కూడా అణు ఒప్పందానికి అంగీకరించాలని, వివాదం పూర్తిగా ముగిసిపోతుందని చెబుతూనే ఉన్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు  అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మాట విని యుద్ధాన్ని నిలిపివేస్తారా అనేది సందేహమే.  భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ శాంతిని కోరినవిధంగానే ఇరాన్ రహస్యంగా శాంతిని అడుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మేం ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేస్తాం. మా దేశానికి ముప్పును తొలగించడానికి ఎన్ని రోజులు పట్టినా దాడులను కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు.

పాకిస్తాన్ కామిక్ ఎంట్రీ
ఇజ్రాయెల్తో  యుద్ధం  ప్రారంభమయ్యే వరకు పాకిస్తాన్  ధైర్యంగా ఇరాన్‌‌‌‌కు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు, ఇజ్రాయెల్ అణుస్థావరాలపై బాంబు దాడి చేసిన విధానాన్ని చూసిన తర్వాత  పాకిస్తాన్  దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. పాక్​ గొప్పగా చెప్పుకునే  ‘ఇస్లామిక్ బాంబు’ను  ఇజ్రాయెల్​ నాశనం చేస్తుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది.  యుద్ధాలు ఎలా ముగుస్తాయో ఎవరూ ఊహించలేరు.

ఇజ్రాయెల్ తన లక్ష్యాలలో కొన్నింటిని అయినా సాధించకుండా యుద్ధాన్ని ఆపదు. ఇరాన్ అగ్ర నాయకుడు అయతుల్లా ఖమేనీ కూడా ఆత్మరక్షణలో పడిపోయారు. ఇజ్రాయెల్ 20 సంవత్సరాల నుంచి దీనికోసమే ఎదురు చూస్తోంది. ఈ యుద్ధం మధ్య ప్రాచ్యంలో పెద్ద మార్పులను తీసుకురావచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి సంబంధించి తమ నిర్ణయం గురించి అమెరికా ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టం చేయలేదు. 

డా.పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్