- డబుల్ బెడ్రూం ఇళ్లను చూసేందుకు వెళ్లిన
- మంత్రి తలసానిని నిలదీసిన జనం
- లక్షలకు లక్షలు కావాలంటే ఏడికెల్లి తెచ్చియ్యాలె
- ఆ పైసలే ఉంటే ఊర్లనే ఇల్లు కట్టుకుంటుంటిమి
- నాలుగేండ్ల నుంచి కడతనే ఉన్నరు.. ఇంకెప్పుడిస్తరు?
- గ్రేటర్ ఎన్నికలొస్తున్నయనే మళ్లీ ఇప్పుడొచ్చిన్రు
- ఇళ్లు కావాలంటే టీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నరని మండిపాటు
- నిలదీసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ , వెలుగు: డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు అడుగడుగునా నిరసన ఎదురైంది. ఇళ్లేవి అని అడిగితే టీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోర్కొక రేటు పెట్టి ఆ పైసలు కడితేనే ఇళ్లు ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలకు లక్షలు అడిగితే ఏడి నుంచి తేవాలని మండిపడ్డారు. ఇన్ని రోజులు తామెవరికీ గుర్తు రాలేదని, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే డబుల్ బెడ్రూం ఇళ్లంటూ మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నేళ్లు వాటిని కడుతూనే ఉంటరని ప్రశ్నించారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడో చూపించాలంటూ అసెంబ్లీలో భట్టి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దాన్ని స్వీకరించిన తలసాని.. గురువారం ఆయనకు డబుల్ బెడ్రూం ఇళ్లు చూపించేందుకు తీసుకెళ్లారు.
అడుగడుగునా నిలదీతలే..
గురువారం పొద్దున్నే బంజారాహిల్స్లోని భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్ వెళ్లారు. అక్కడ భట్టిని పికప్ చేసుకుని హైదరాబాద్లోని జియాగూడ, గోడేకిఖబర్, నాంపల్లి, ఖైరతాబాద్, నెక్లెస్రోడ్లోని అంబేద్కర్నగర్, బోయిగూడ, వెస్ట్మారేడ్పల్లిల్లో కడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్లను చూపించారు. నాలుగు గంటల పాటు సాగిన పరిశీలనలో జనం నుంచి వాళ్లకు నిరసన ఎదురైంది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని అడిగితే లంచాలు అడుగుతున్నారని ఇద్దరు నేతలను లబ్ధిదారులు ప్రశ్నించారు. నెక్లెస్రోడ్లోని అంబేద్కర్నగర్లో మంత్రి తలసానిని నిలదీశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, లబ్ధిదారులకు మధ్య గొడవ జరిగింది. లబ్ధిదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నరు. ఫస్ట్ ఫ్లోర్ అయితే రూ.4 లక్షలు, సెకండ్ ఫ్లోర్ అయితే రూ.3 లక్షలు, మూడో ఫ్లోర్ అయితే రూ.2 లక్షలు అడుగుతున్నరు. అన్ని లక్షలు ఏడి నుంచి తేవాలె. ఆ లక్షలే ఉంటే ఊర్లె తక్కువ రేటుకే జాగా కొనుక్కని బతికేటోళ్లం కదా. ఉన్నోడు మరింత ఉన్నోడైతుంటే.. పేదోడు ఇంకా పేదోడైతుండు’’ అని ఓ మహిళ వాపోయారు. అంబేద్కర్ నగర్, గోడేకిఖబర్లో ఇళ్లు స్టార్ట్ చేసి నాలుగేళ్లు అవుతోందని, ఇప్పటికీ కడుతూనే ఉన్నారని లబ్ధిదారులు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు మళ్లీ డబుల్ బెడ్రూం ఇండ్లంటున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెన్నేండ్లు ఇండ్లు కడతరని, ఇంకెన్నాళ్లు తాము అద్దెకుండాలని ప్రశ్నించారు. కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని, కనీసం ఆ కిరాయి అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లు ఎప్పుడిస్తరని అడిగితే టీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు నేతల పర్యటన శుక్రవారం కూడా కొనసాగనుంది.
పాతవాటినే కూలగొట్టి కడుతున్నరు: భట్టి
2లక్షల 68 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కడుతున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పటికే లక్ష ఇళ్లు పూర్తయ్యాయని చెప్పిందని భట్టి విక్రమార్క అన్నారు. సవాల్ మేరకు తమకు ఇప్పటిదాకా 3,428 ఇళ్లను తలసాని చూపించారన్నారు. ఇప్పటిదాకా చూసిన వాటిలో పాత వాటినే కూలగొట్టి కడుతున్నారన్నారు. దీంతో ఆ ఇండ్లు ఖాళీ చేసిన వాళ్లు అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. లక్ష ఇండ్లు చూపించే వరకు హైదరాబాద్లో పర్యటిస్తూనే ఉంటానని చెప్పారు. తనతో పాటు క్వాలిటీ టీంను కూడా తీసుకొచ్చామని, వాళ్లు రిపోర్ట్ ఇచ్చాక డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి మాట్లాడుతామని అన్నారు. కొత్తగా కేవలం 400 మందికే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారని ఆయన అన్నారు. బాధితులు చెప్పిన అన్నీ అంశాలను నోట్ చేసుకున్నానని చెప్పారు.
ఒక్క డబుల్ ఇల్లు కోటి రూపాయలు: తలసాని
ఇంతకుముందు ఇచ్చే ఇళ్లకు ప్రభుత్వాలు కొంత డబ్బులు వసూలు చేసేవని, ఇప్పుడు ప్రభుత్వమే పూర్తి ఫ్రీగా పేదలకు ఇళ్లు ఇస్తోందని మంత్రి తలసాని అన్నారు. సర్కారు ఇస్తున్న ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి విలువ రూ.కోటి ఉంటుందన్నారు. గ్రేటర్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామ న్నారు. దేశ చరిత్రలో మొదటిసారి ఇంత మంచి ఇళ్లు కట్టించి ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బస్తీ ప్రజల సమక్షంలోనే ఇళ్లను పంచుతామని, లేట్ అయినా క్వాలిటీతోనే కట్టిస్తామని అన్నారు. హైదరాబాద్లో కడుతున్న మొత్తం ఇళ్లను భట్టికి చూపిస్తానని హామీ ఇచ్చానన్నారు. ఒక్కరోజే అన్ని ఇండ్లను చూపించడం సాధ్యం కాదని, ఇంకా 60 ప్రాంతాలు తిరగాల్సి ఉందన్నారు. కొల్లూరు, మేడ్చల్, జవహర్నగర్, కుత్బుల్లాపూర్లలో శుక్రవారం పర్యటిస్తామన్నారు.