ఆధార్‍ అప్​డేట్ కోసం ఉరుకులు పరుగులు

ఆధార్‍  అప్​డేట్ కోసం ఉరుకులు పరుగులు
  •     ఆధార్‍  అప్​డేట్ కోసం ఉరుకులు పరుగులు
  •     లబ్ధిదారులతో ఆధార్‍, మీసేవ సెంటర్లు కిటకిట
  •     కొత్త రేషన్‍ కార్డు కోసం కౌంటర్ల వద్ద ఎగబడ్డ జనాలు 
  •     పిల్లలకు ఆధార్‍  తీయడానికి రోజంతా లైన్లలో పేరెంట్స్
  •     సర్కారు 6 గ్యారంటీల కోసం భారీగా తరలివెళ్లిన జనాలు

వరంగల్‍/జగిత్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి ఎవరూ ఊహించని స్పందన లభించింది. పదేండ్ల బీఆర్‍ఎస్‍  పాలనలో కొత్త రేషన్‍ కార్డులు ఇవ్వకపోవడం,  ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‍  సర్కారు 6 గ్యారంటీ స్కీంలను ప్రవేశపెట్టడంతో ప్రతి దరఖాస్తు సెంటర్  వద్ద జనజాతర కనిపించింది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సమయాల్లో జనాలు తాము ఉండే వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు తరలివచ్చినట్లే గురువారం ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమానికి తరలివెళ్లారు. 

కాగా, ప్రజలు అధికారులకు దరఖాస్తులు అందించే వరకు ప్రతి జిల్లాలో వేలాది జనాలకు ఆధార్‍  కార్డు ప్రాధాన్యం ఏంటో పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. దీంతో అప్పటికప్పుడు ప్రజాపాలన కౌంటర్ల నుంచి ఆధార్‍, మీసేవ సెంటర్లకు పరుగులు పెట్టారు. దీంతో ప్రజాపాలన సెంటర్ల కంటే ఎక్కువగా ఆధార్‍  సెంటర్లు జనాలతో నిండిపోయాయి. 

ఆధార్‍  కార్డుల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్‍ 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందే ఆధార్‍  కార్డులు రావడంతో అప్పట్లో జనాలు వాటిని పొందారు. ఎవరో కొందరు అప్‍డేట్‍  చేసుకోవడం మినహా అందరి కార్డుల్లోనూ ఇంకా రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్‍ గానే ఉంది. అయితే బ్యాంకు ఖాతాలు తెరిచేటపుడు, లోన్లు తీసుకునే సమయాల్లో మామూలుగా ఆంధ్రప్రదేశ్‍ స్థానంలో తెలంగాణ పేరు మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇన్నాళ్లు మూలకు పెట్టిన ఆధార్‍  కార్డులను ప్రజలు బయటకు తీశారు. 

ఆధార్‍లో రాష్ట్రం పేరు విషయంలో అధికారులు ఎటువంటి రూల్స్ పెట్టకున్నా.. కార్డుల్లో తెలంగాణ పేరు లేకుంటే స్కీంలు వస్తాయో రావోననే సందేహాలు నెలకొన్నాయి.  దీంతో లబ్ధిదారులు ఒక్కసారిగా ఆధార్‍, మీసేవ సెంటర్లకు పరుగులు పెట్టారు. రాష్ట్రం పేరు, ఇంటి అడ్రస్‍, పెళ్లి అయ్యాక భర్త ఇంటిపేరు, అడ్రస్‍  మార్చుకోని వారంతా ప్రస్తుతం మార్పు కోసం రావడంతో ఆధార్‍, మీసేవ సెంటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో మార్పులు చేయాలంటే సరైన ఫ్రూఫ్‍లు లేనివారికి అక్కడి సిబ్బంది గెజిటెడ్‍ ఆఫీసర్లతో ధ్రువీకరించే పేపర్లు అందించడంతో.. పెద్దాఫీసర్ల సంతకాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.   

జిరాక్స్ సెంటర్లలో దరఖాస్తుకు రూ.40 నుంచి 50

ప్రజాపాలన సెంటర్లలో దరఖాస్తులు తీసుకోడానికి ఇబ్బంది పడే జనాల పరిస్థితిని జిరాక్స్  సెంటర్ల నిర్వాహకులు క్యాష్‍  చేసుకున్నారు. ఇదే అదనుగా చాలా చోట్ల జిరాక్స్ సెంటర్లలో ఒక్కో దరఖాస్తుకు లబ్ధిదారుల నుంచి రూ.40 నుంచి 50 వరకు వసూలు చేశారు.

గ్యాస్  ఏజెన్సీల వద్ద బారులు

రాష్ట్ర సర్కారు ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో జనాలు ఆధార్  సెంటర్ల వద్ద జనాలు బారులు తీరారు. ముఖ్యంగా రూ. 500 గ్యాస్  సిలిండర్  పథకం అమలు కోసం కేవైసీ  అప్ డేట్  చేసుకోవాలని ఆఫీసర్లు సూచిండంతో గ్యాస్ వినియోగదారులు గ్యాస్  ఏజెన్సీలకు పరుగులు పెట్టారు. దీంతో భారీ సంఖ్యలో క్యూలైన్లు నెలకొన్నాయి. 

ఉదయం 7 నుంచే ఆధార్  సెంటర్లు ఫుల్

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 6 గ్యారంటీ పథకాలకు తోడు కొత్త రేషన్  కార్డుల కోసం జనాలు ప్రజాపాలన సెంటర్ల వద్ద ఎగబడ్డారు. కాగా, రేషన్‍  కోసం ఆధార్‍  కార్డు కంపల్సరీ అని చెప్పడంతో ఇన్నాళ్లు పిల్లలకు ఆధార్‍ కార్డు తీయనోళ్లంతా ఆధార్‍  సెంటర్ల వద్దకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆధార్‍  కేంద్రాల్లో అందుబాటులో ఉండే సిబ్బంది  రోజుకు 100 లోపు మాత్రమే అప్లికేషన్లు తీసుకునే అవకాశం ఉండగా.. చాలా కేంద్రాలకు వేల మంది తరలివెళ్లారు. ఐదారేండ్ల పిల్లలతో పాటు కొన్ని రోజుల క్రితం పుట్టిన పిల్లలతో బాలింతలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కొక్కరికి పావుగంట కంటే ఎక్కువ పట్టడంతో ఉదయం 7 గంటల నుంచే ఆధార్‍  సెంటర్లన్నీ తల్లిదండ్రులతో నిండిపోయాయి. సాయంత్రం సెంటర్లు క్లోజ్‍  చేసే వరకు వందలాది మంది క్యూలో గడిపారు.