- దున్నపోతుకు గడ్డేసి.. బర్రెను పాలు ఇవ్వమంటే ఎలా?: కేటీఆర్
- పాలన చేతగాక కేసీఆర్పై సీఎం విమర్శలు చేస్తున్నరని కామెంట్
మహబూబాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజలంతా కాంగ్రెస్ మాయమాటలు నమ్మి అధికారం కట్టబెట్టి ఇప్పుడు గోస పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దున్నపోతుకు గడ్డి వేసి.. బర్రెను పాలు ఇవ్వమంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షతన ఆ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక.. బీఆర్ఎస్ను తిట్టడమే దినచర్యగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. నమ్మి ఓటేసిన ప్రజలను వంచించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతుబంధును ఎగ్గొట్టారని, పింఛన్ల పెంపు జాడే లేదన్నారు. నిరుద్యోగ యువతకు భృతి, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం హామీలు ఎటు పోయాయని ప్రశ్నించారు.
మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్.. పిల్లలు, పురుషుల బస్ చార్జీలను ఎందుకు పెంచిందో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ఢిల్లీకి మూటలు మోసే పనుల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల్లో శ్మశాన వాటికలు, హరితహారం, వైకుంఠధామాలు సహా అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తుచేశారు.
సర్పంచ్ ఫలితాల్లోనూ అవకతవకలు
సర్పంచ్ ఎన్నికల ఫలితాల వెల్లడి టైంలో ఆఫీసర్లు అనేక చోట్ల అవకతవకలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. కొన్నిచోట్ల.. తొలుత బీఆర్ఎస్ క్యాండిడేట్లు గెలిచారని ప్రకటించిన ఆఫీసర్లు.. తర్వాత అధికార పార్టీ నాయకుల ఒత్తిడులకు తలొగ్గి ఆ పార్టీ లీడర్లకు అనుకూలంగా రిజల్ట్ ప్రకటించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అణచివేతలు, కుట్రలు పన్నినప్పటికీ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్లు భారీ సంఖ్యలో విజయం సాధించారన్నారు.
రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.27mhbd10,11,12: మహబూబాబాద్ లో మాట్లాడుతున్న బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ 27mhbd13: నూతన సర్పంచ్లను సన్మానిస్తున్న బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్
