హైదరాబాద్, వెలుగు: ఒకటి రెండు నెలల క్రితం వరకూ కరోనా టెస్టులంటేనే జనం హడలిపోయే వాళ్లు. పీపీఈ కిట్లు వేసుకుని మెడికల్ టీమ్, శానిటైజర్లు పట్టుకుని మున్సిపల్ టీమ్, ప్రొటెక్షన్ కోసం పోలీస్ టీమ్ వచ్చి పేషెంట్ను అంబులెన్సులో వేసుకుని తీసుకుపోయేవారు. ఒకవేళ పాజిటివ్ అని తేలిందా అంతే.. ఆ ఏరియా మొత్తం హడల్. ఇంటి మీద స్టాంపు పడేది. చుట్టుపక్కల వాళ్లంతా తలుపులు, కిటికీలు బంద్ చేసేవారు. అపార్ట్మెంట్లలో అయితే ఫ్లాట్లన్నీ ఖాళీ అయ్యేవి. ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది. సాధారణంగా ఇంటి దగ్గర హెల్త్ చెకప్ చేయించుకున్నట్టే ఇప్పుడు కోరోనా టెస్టులను కూడా చేయించుకుంటున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు పీపీఈ కిట్ల హడావుడి లేకుండా గ్లోవ్స్, మాస్కులు వేసుకుని శాంపిళ్లు తీసుకుంటున్నారు. నాలుగు పైసలు ఖర్చయినా సుఖంగా ఉందని చాలా మంది అనుకుంటున్నారు.
మార్చి నుంచి మొదలు
రాష్ట్రంలో మార్చి నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి. దుబాయ్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొదటి కేసు. తర్వాత మర్కజ్ యాత్రికులు యాడ్ అయ్యారు. అప్పట్లో విదేశీ ప్రయాణికులను గుర్తించి వాళ్లకు నిర్బంధంగా టెస్టులు చేశారు. పోలీసులు ప్రైమరీ కాంట్రాక్టులను ఐడెంటిఫై చేసి టెస్టులకు తరలించేవారు. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్లా సాగేది. అప్పట్లో టెస్టింగ్ సెంటర్లు తక్కువ. టెస్టుల సంఖ్యా తక్కువే. కొన్ని గవర్నమెంట్ దవాఖానాల్లోనే టెస్టులు చేసేవాళ్లు. లిమిటెడ్గా శాంపిళ్లు తీసుకునే వాళ్లు. దాంతో పెద్ద పెద్ద క్యూలు ఉండేవి. ప్రైవేటు వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం, జిల్లాల్లో టెస్టులు చేయడంతో సింప్టమ్స్ ఉన్న వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
పాజిటివ్ వస్తే ఇక అంతే..
ఒకవైపు టెస్టులు చేయించుకోవడానికి ఇన్ని తిప్పలుంటే.. పాజిటివ్ అని తేలితే ఇంకిన్ని అవస్థలు ఉండేవి. ఆ కుటుంబాన్ని వెలివేసినట్టుగా జనం చూసేవారు. కాలనీలకు కాలనీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఊర్లలో అయితే కరోనా పేషెంట్లు సామాజిక బహిష్కరణకు గురయ్యారు. ఊరు బయట చెట్ల కిందే ఉండాల్సి వచ్చింది. కిరాయికి ఉండేవాళ్లను ఖాళీ చేసి పొమ్మని ఓనర్లు సతాయించేవారు.
టెస్టు చేయించుకుంటే టెన్షన్
టెస్టుల సంఖ్య పెంచే క్రమంలో ప్రభుత్వం మొబైల్ బస్సులను పెట్టింది. ప్రైవేటు ల్యాబ్ల వాళ్లు ఇంటికొచ్చి టెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అయితే 15 రోజుల క్రితం కూడా ఇంటికి వచ్చే ల్యాబ్ టెక్నీషియన్లు పీపీఈ కిట్లు వేసుకుని శాంపిళ్లు తీసుకునే వారు. అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఉన్న వాళ్లు వీరిని చూసి భయపడేవారు. టెస్టింగ్ చేయించుకున్న వాళ్లను నిలదీసేవారు. వాళ్లకు బోలెడు కండిషన్స్ పెట్టేవారు. ఆ ఇంటికి ఎవరైనా వచ్చిపోతుంటే శానిటైజ్ చేసేవారు. ఆ పరిసరాల్లో ఎవరూ తిరిగేవారు కాదు. దీంతో చాలా మంది కరోనా లక్షణాలున్నా టెస్టులు చేయించుకోకుండా ఇండ్లలోనే ఉండేవారు.
భారీగా ఆఫర్లు.. డిస్కౌంట్లు..
ప్రైవేటు ల్యాబ్లు ఆర్టీపీసీఆర్కి మూడు నుంచి మూడున్నర వేలు ఛార్జ్ చేస్తున్నాయి. ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే డిస్కౌంట్ ఇస్తున్నాయి. యాంటీబాడీస్ టెస్టులు750 నుంచి వెయ్యికి చేస్తున్నాయి. దీంట్లో కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. కరోనా టెస్టుతోపాటు రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. చాలా మందికి డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ మెసేజ్లు చేస్తున్నాయి. కరోనాతో పాటు వేరే జబ్బులు ఉన్న వాళ్లు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. ప్రభుత్వ బులెటిన్ ప్రకారం కోమార్బిడ్ కండీషన్తో చనిపోతున్న వాళ్ల శాతం 53.87గా ఉంది. దాంతో అలాంటి సమస్యలున్న వాళ్లు చిన్న జ్వరం వచ్చినా టెస్టులు చేయించుకుంటున్నారు.
మామూలు రోజుల్లో మాదిరిగానే శాంపిళ్ల సేకరణ
ఇపుడు సీజన్ మారిపోయింది. ఏది సీజనల్ ఫీవరో, ఏది కరోనా ఫీవరో తెలియని పరిస్థితి. వీటి సింప్టమ్స్ ఒకేలా ఉండడంతో ప్రైవేటు ల్యాబ్ల వాళ్లు శాంపిల్స్ కలెక్షన్ను సింపుల్ చేశారు. స్టార్టప్లు సర్టిఫైడ్ ల్యాబ్లతో టై అప్ పెట్టుకుని శాంపిళ్లు సేకరిస్తున్నాయి. బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులు ఉన్న వారితో పాటు చాలా మందికి రెగ్యులర్గా టెస్టులు చేయించుకునే అలవాటు ఉంటుంది. లాక్డౌన్ వల్ల చాలా మంది వాటిని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇపుడు పరిస్థితి మారడంతో అందరూ టెస్టులు చేయించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో ల్యాబ్ల వాళ్లు మామూలు రోజుల్లో మాదిరిగానే ఇండ్లకు వచ్చి గ్లోవ్స్, మాస్కులు వేసుకుని శాంపిళ్లు తీసుకుంటున్నారు. ఆర్టీపీసీఆర్, యాంటీబాడీస్ టెస్టుల్లో ఏది కావాలంటే అది చేస్తున్నారు.