
లాక్డౌన్.. సోషల్ డిస్టెన్స్.. కరోనా భయం.. ముక్క ముందు పక్కకెళ్లిపోయాయి. ఎప్పట్లాగే ఈ సండే కూడా జనమంతా మటన్ కోసం, చికెన్ కోసం, చేపల కోసం ఎగబడ్డరు. రాజధాని హైదరాబాద్ మొదలుకొని హుజురాబాద్ దాకా ఇదే తంతు. కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించినా చాలా చోట్ల నాన్వెజ్ షాపుల ముందు గుంపులు గుంపులుగా గుమికూడి కొనుక్కెళ్లారు. వీళ్లలో చాలామంది మాస్క్లు కూడా వేసుకోలేదు. మన దగ్గరే కాదు చాలా రాష్ట్రాల్లో ఇవే సీన్లు. పై ఫొటో హుజురాబాద్లో దించింది. ఈ పక్కన ఉన్నది చెన్నై కాశిమేడులో ఫిష్ మార్కెట్ దగ్గర దించిన ఫొటో.
సండే నాన్వెజ్ తినాలనే యావలో జనం లాక్డౌన్ సంగతి మరిచిపోయిన్రు. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో మటన్, చికెన్ షాపులు తెరవంగనే గుంపులుగుంపులుగా ఎగబడ్డరు. నగరాలు, పట్టణాల్లో చాలాచోట్ల జనం సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. రెడ్ అలర్ట్ అమలవుతున్న కరీంనగర్ సిటీలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు, ఆఫీసర్లు రంగంలోకి దిగిన్రు. అందరినీ సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకున్నరు. నిబంధనలు పాటించని షాపుల యజమానులకు జరిమానాలు విధించిన్రు. మరోసారి ఇలా జరిగితే సీజ్ చేస్తమని హెచ్చరించిన్రు. ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ఫిర్యాదు అందడంతో భద్రాద్రి కొత్తగూడెంలోని రెండు షాపులను ఆఫీసర్లు సీజ్ చేసిన్రు. పాల్వంచలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ చేపల వ్యాపారిపై కేసు నమోదు చేసిన్రు. నిర్మల్ పట్టణంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మటన్, చికెన్ అమ్మిన 23 దుకాణాలకు మున్సిపల్ ఆఫీసర్లు రూ.32 వేల ఫైన్ వేసిన్రు. అన్ని చోట్ల పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చిపోయిన్రు. కాగా, ఇదే అదనుగా మటన్ను రూ.700 వరకు, చికెన్ను రూ.210 వరకు విక్రయించిన్రు.