- పొల్యూషన్ను అరికట్టాలంటూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తం
- అడ్డుకున్న పోలీసులపై పెప్పర్ స్ప్రే చల్లిన నిరసనకారులు
- మావోయిస్టు హిడ్మా అమర్ రహే అంటూ నినాదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్ను అరికట్టాలని ఆదివారం స్థానికులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై నిరసనకారులు పెప్పర్ స్ప్రే చల్లడంతోపాటు.. ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన మడావి హిడ్మాకు అనుకూలంగా నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో సోమవారం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడి చేశారన్న ఆరోపణలపై 22 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ను మెరుగుపర్చడానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కొందరు స్థానికులు ఆదివారం ఇండియా గేట్ వద్ద నిరసనకు దిగారు. అయితే, ఇండియా గేట్ వద్ద ఎలాంటి ఆందోళనలకు పర్మిషన్ లేదంటూ పోలీసులు వారిని అక్కడినుంచి పంపించేశారు. దీంతో నిరసనకారులు.. సీ-హెక్సాగాన్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అందులో కొందరు మావోయిస్టు హిడ్మా అమర్ రహే అంటూ స్లోగన్స్ ఇచ్చారు. వారిని అక్కడినుంచి పంపించేయడానికి ప్రయత్నించిన పోలీసులపై హఠాత్తుగా పెప్పర్ స్ప్రే చల్లారు. దీంతో నలుగురు పోలీసుల కండ్లు, ముఖాలకు గాయాలయ్యాయి. వారిని ఆర్ఎంఎల్ హాస్పిటల్లో చేర్పించి.. చికిత్స అందించారు. మరుసటిరోజే దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. 22 మందిని అదుపులోకి తీసుకొని.. ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, రహదారిని దిగ్బంధించడం, పోలీసు సిబ్బందిపై దాడి చేయడం, నిరసన నిబంధనలను ఉల్లంఘించడంలాంటి నేరాలపై ఎఫ్ఐఆర్నమోదు చేశారు.
ఆ స్లోగన్స్తో మాకు సంబంధం లేదు..
‘ఢిల్లీ అగైనెస్ట్ క్లీన్ ఎయిర్’ నిరసనలో భాగంగా కొందరు చేసిన స్లోగన్స్తో తమకు సంబంధంలేదని ఇందులో పాల్గొన్న సైంటిస్ట్స్ ఫర్ సొసైటీ (ఎస్ఎఫ్ఎస్) పేర్కొన్నది. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో కాలుష్య సమస్యను హైలెట్ చేయడం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడంతోపాటు ప్రజల్లో చైతన్యం తేవడమే లక్ష్యంగా నిరసన చేపట్టినట్టు తెలిపింది. హిమ్ఖండ్, బీఎస్సీఈఎం అనే రెండు సంస్థలే.. హిడ్మా అనుకూల నినాదాలు చేశాయని పేర్కొన్నది. ఈ చర్యలను తాము కూడా నిస్సందేహంగా ఖండిస్తున్నామని, ఉన్నత స్థాయి విచారణ డిమాండ్ చేస్తున్నామని ఎస్ఎఫ్ఎస్ తెలిపింది.
