- డీపీఆర్వోల ఓరియంటేషన్ప్రోగ్రామ్లో మంత్రి పొంగులేటి
- రెండేండ్లలో తెలంగాణకు కొత్త దిశ చూపామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రెండేళ్ల పాలనలోనే తెలంగాణకు ఒక స్పష్టమైన కొత్త దిశను కాంగ్రెస్సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చూపించిందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏ మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచారో, ఆ మార్పును రెండేండ్లలోనే ప్రజల కళ్ల ముందు నిలబెట్టామని తెలిపారు.
శుక్రవారం సమాచార శాఖ, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నాంపల్లిలో డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్వో) లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. “మేం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో సంక్షోభంలో ఉంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ సంక్షోభం నుంచి బయటపడి, అభివృద్ధి–సంక్షేమాలను పరుగులు పెట్టిస్తున్నాం.
సీఎం రేవంత్ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా నిలిచాం.” అని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి చేరడం లేన్నారు. ప్రజలకూ ప్రభుత్వానికీ వారధిగా ఉండాల్సిన ప్రజా సంబంధాల అధికారుల (పీఆర్వోల) పాత్ర బలోపేతం కావాల్సిన అవసరముందని సూచించారు. ప్రస్తుత మీడియా మార్పులకు అనుగుణంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
సోషల్ మీడియాను ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి వినియోగించాలన్నారు. ప్రతి జిల్లాకు సమర్థవంతమైన డీపీఆర్వోల నియమించాలని, ఇతర విభాగాల్లో ఉన్నవారి డిప్యూటేషన్లను రద్దు చేయాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఐ అండ్ పీఆర్ కమిషనర్ను ఆదేశించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, సీఎం సీపీఆర్వో జి.మల్సూర్ పాల్గొన్నారు.
