ఒక్క స్కానింగ్​ సెంటర్​లో కాదు.. నాలుగు సెంటర్లలో వికృత చేష్టలు 

ఒక్క స్కానింగ్​ సెంటర్​లో కాదు.. నాలుగు సెంటర్లలో వికృత చేష్టలు 
  •     మహిళలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్​ చేసిన కేసులో ట్విస్ట్​ 
  •     నిజామాబాద్​లో సెంటర్ల ఆగడాలపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు 
  •     120 కేంద్రాల పరిశీలనకు 50 టీంలు 

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​లోని అయ్యప్ప స్కానింగ్​ సెంటర్​లో యువతులు, మహిళలను స్కానింగ్​ చేసే టైంలో దొంగచాటుగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్​మెయిల్​చేయడం, లైంగికంగా వేధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పరువు పోతుందని,  భయంతో చాలా మంది ఈ విషయాన్ని బయటకు చెప్పకపోగా ఒక్క మహిళ ధైర్యం చేసి దారుణాన్ని బయటపెట్టడంతో నిందితుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.

అయితే, అయ్యప్ప స్కానింగ్​సెంటర్​ ఆపరేటర్​ ప్రశాంత్ ​విచారణలో మరో మూడు సెంటర్లలోనూ ఇలాగే జరిగిందని చెప్పడంతో అధికారులు షాక్​ తిన్నారు. దీంతో కలెక్టర్ ​రాజీవ్​గాంధీ హనుమంతు సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లాలోని మొత్తం సెంటర్ల పరిశీలనకు 50 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రశాంత్ ​బాధితులు వంద  మంది దాకా ఉన్నట్లు తెలుస్తుండగా, మిగతా సెంటర్లలో ఎంత మంది ఉన్నారనే విషయం దర్యాప్తులో తేలనుంది.  

మొత్తం 50 టీంల అపాయింట్​ 

అయ్యప్ప స్కానింగ్​ సెంటర్​ మేనేజ్​మెంట్​కు పది రోజుల గడువుతో నోటీస్​ జారీ చేసిన డీఎంహెచ్​వో డాక్టర్​ తుకారాం రాథోడ్​.. నలు గురు మహిళా డాక్టర్లతో కమిటీని విచారణకు నియమించారు. మరోవైపు కలెక్టర్​ ఏర్పాటు చేసిన 50 టీంలు  ఐదు గవర్నమెంట్​సెంటర్లు  మినహా మొత్తం 120 స్కానింగ్​ కేంద్రాలను పరిశీలించి రిపోర్టు అందించనుంది. 

పది రోజుల్లో రిపోర్టు ఇవ్వాలి 

జిల్లాలోని అన్ని స్కానింగ్​ సెంటర్లను జూన్​1 నుంచి గ్రౌండ్​ విజిట్ ​చేసి పది రోజుల్లో రిపోర్టు అందించాలని టీమ్స్​కు ఆర్డర్స్​ఇచ్చామని డీఎంహెచ్​వో డాక్టర్​ తుకారాం రాథోడ్ ​తెలిపారు. స్కానింగ్​ కోసం వచ్చే మహిళలకు సహాయపడడానికి సెంటర్లలో మహిళా స్టాఫ్​నే నియమించాలని మేనేజ్​మెంట్లకు సూచించామన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

స్కానింగ్​సెంటర్లలో మెడికల్, నాన్​ మెడికల్ ​స్టాఫ్​ను విభజించాలని, మెడికల్ ​స్టాఫ్​ను మాత్రమే లోపలకు అనుమతించాలని సీపీ కల్మేశ్వర్​ సెంటర్ల నిర్వాహకులకు  ఆదేశించారు. స్కానింగ్​ సేఫ్​గా  లేదని అనిపిస్తే మేనేజ్​మెంట్​కు చెప్పాలని, వారు స్పందించకపోతే తమకు సమాచారం ఇవ్వాలని  సీపీ ఒక ప్రకటనలో కోరారు.