
- కంపెనీలకు భారీగా ప్రాఫిట్స్ రావడమే కారణం
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ రేట్లను లీటర్కు రూ.5– రూ. 10 వరకు తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చూస్తున్నాయి. ఈ కంపెనీల మొత్తం ప్రాఫిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ క్వార్టర్ నాటికి రూ.75 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో క్రూడాయిల్ సేకరణపై చేసిన ఖర్చులు దిగిరావడంతో వచ్చే నెల నుంచే రేట్లను తగ్గించనున్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. హెచ్పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్ కిందటేడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లను మార్చలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో ఈ మూడు కంపెనీలకు రూ.57,092 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్లో వచ్చిన రూ.1,137.89 కోట్లతో పోలిస్తే ఇది 4,917 శాతం ఎక్కువ. హెచ్పీసీఎల్ క్యూ3 రిజల్ట్స్ ఈ నెల 27 న విడుదల కానున్నాయి. బ్రెంట్ క్రూడ్ 78 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.