న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రూ. 18 వేల కోట్ల సమీకరణ కోసం రైట్స్ ఇష్యూ చేపడుతోంది. రైట్స్ ఇష్యూ కి బోర్డు ఆమోదం వచ్చినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు బీపీసీఎల్ సమాచారం అందించింది. రైట్స్ ఇష్యూ షేర్ల ధర, రికార్డు డేట్, ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. బీపీసీఎల్ ఈక్విటీలో మరింత పెట్టుబడి పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనతోనే బీపీసీఎల్ రైట్స్ ఇష్యూకు వస్తోంది.
చమురు రంగంలోని పీఎస్యూ కంపెనీలకు రూ. 35 వేల కోట్ల క్యాపిటల్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐఓసీ, హెచ్పీసీఎల్ల నుంచి కూడా రైట్స్ ఇష్యూలు వస్తాయని స్టాక్ మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇందుకు తగినట్లుగానే ఇటీవలే ఐఓసీ తన ఆథరైజ్డ్ ఈక్విటీని రెట్టింపు చేసింది. ఈ కంపెనీ ఆథరైజ్డ్ ఈక్విటీ ఇప్పుడు రూ. 30 వేల కోట్లకు పెరిగింది.