
- రూ.13 వేల కోట్లు సేకరించే అవకాశం
న్యూఢిల్లీ: యూఎస్ కంపెనీ వాల్మార్ట్కు చెందిన ఫోన్పే, ఐపీఓ ద్వారా సుమారు 1.5 బిలియన్ డాలర్లు (రూ.13 వేల కోట్లు) సేకరించేందుకు సెబీ వద్ద కాన్ఫిడెన్షియల్ రూట్లో డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసింది. ఈ లిస్టింగ్ ద్వారా కంపెనీ విలువ సుమారు 15 బిలియన్ డాలర్ల (రూ.1.32 లక్షల కోట్ల) కు చేరే అవకాశం ఉంది. సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈకి ఐపీఓ పేపర్లు సబ్మిట్ చేశామని కంపెనీ ప్రతినిధి అన్నారు. అయితే, ఈ దాఖలుతో ఐపీఓ కచ్చితంగా ఉంటుందన్న అర్థం కాదని స్పష్టం చేశారు. 2024–25లో ఫోన్పే నికర నష్టం ఏడాది లెక్కన 13.4శాతం తగ్గి రూ.1,727.4 కోట్లకు చేరింది.
ఆదాయం పెరగడంతో ఈ మెరుగుదల కనిపించింది. ఆపరేటింగ్ రెవెన్యూ 40.4శాతం పెరిగి రూ.7,114.8 కోట్లకు చేరింది. ఖర్చులు 21.1శాతం పెరిగి రూ.9,394 కోట్లయ్యాయి. పేమెంట్ సెటిల్మెంట్ ఫీజులు 44.7శాతం పెరిగి రూ.1,688.1 కోట్లకు చేరాయి. ఉద్యోగ ఖర్చులు 13.6శాతం పెరిగాయి.పేమెంట్స్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నా, ఫోన్పే క్రెడిట్, ఇన్సూరెన్స్, స్టాక్బ్రోకింగ్ రంగాల్లో విస్తరించింది. ఆర్బీఐ నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పొందింది.
2022లో కంపెనీ తన హెడ్క్వార్టర్ను సింగపూర్ నుంచి ఇండియాకు మార్చింది. ఐపీఓ నిర్వహణకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ సంస్థలను ఫోన్పే ఎంపిక చేసింది. 2023లో ఈ కంపెనీ వాల్యుయేషన్ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు స్టాక్ బ్రోకింగ్ కంపెనీ గ్రో కూడా ఇటీవల ఐపీఓ పేపర్లను సెబీకి సబ్మిట్ చేసింది.