పిజ్జా డెలివరీ గర్ల్పై మహిళల దాడి

పిజ్జా డెలివరీ గర్ల్పై మహిళల దాడి

ఆమె.. పిజ్జా డెలివరీ గర్ల్. పిజ్జాను డెలివరీ చేసేందుకు స్కూటీపై వెళ్లిన యువతి.. ఓ ఇంటి ఎదుట నిలబడింది. ఈక్రమంలో అటువైపుగా వెళ్తున్న నలుగురు యువతుల కళ్లలోకి కళ్లు పెట్టి చూసింది. దాన్ని కూడా తప్పు పట్టిన నలుగురు యువతులు కలిసి పిజ్జా డెలివరీ గర్ల్ ను చితకబాదారు. ఇద్దరు చేతులు పట్టుకోగా, మరో ఇద్దరు విచక్షణారహితంగా కర్రలతో దాడికి తెగబడ్డారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని బాధిత యువతి చెబుతున్నా వినకుండా ఆ నలుగురు యువతుల గ్యాంగ్ విరుచుకుపడింది. . ‘ పోయి పోలీసులను పిలుచుకురా’ అని సవాల్ విసురుతూ దారుణంగా కొట్టింది.  చివరకు బాధిత యువతి పరుగుపరుగున సమీపంలోని ఇంట్లోకి వెళ్లి తలదాచుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన జూన్ 11న జరిగినట్లు గుర్తించారు. వీడియోను నిందితులే సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిపారు.  దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.