- తెరపైకి కొత్త లీడర్లు
- ఎమ్మెల్యేలకు చెక్ పడితే తమకు కలిసొస్తుందని ధీమా
- ఉమ్మడి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతాయని ప్రచారం
నల్గొండ, వెలుగు : రూలింగ్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఎక్కువగా ఉందని పీకే రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో టికెట్ ఆశించే నాయకులు మాత్రం ఇది తమకు కలిసొస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తరఫున, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు ఇప్పుడున్న వాళ్లను పక్కన పెడితే తమకు చాన్స్ వస్తుందని ఆనందపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని పీకే రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఈ లిస్ట్లో ఉమ్మడి జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండొచ్చన్న విషయంపై పార్టీ కేడర్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరు ముఖ్యనాయకులు మాత్రం 5 చోట్ల మార్పులు అనివార్యమన్న సంకేతాలు ఇస్తున్నారు. మరికొంతమంది సీనియర్లు అయితే మార్పులు ఉండొచ్చుగానీ.. కచ్చితంగా ఎంత మంది అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. పీకే రిపోర్ట్ ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లను మారుస్తారా ? లేకపోతే ఎలక్షన్లకు ఇంకా సమయం ఉన్నందున ఈ లోగా తమ పనితీరు మార్చుకోవాలని టైం ఇస్తారా ? అన్నది సందేహంగా మారింది. అయితే ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం సిట్టింగ్లను పక్కనపెడితే తమకు చాన్స్ వస్తుందని చాలా మంది లీడర్లు ఆశ పడుతున్నారు. మరికొన్ని చోట్ల వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
5 నియోజకవర్గాలపైనే ఫోకస్...
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 5 చోట్ల క్యాండిడేట్లను మార్చాల్సి వస్తే తమకు కచ్చితంగా అవకాశం వస్తుందన్న నమ్మకంతో సీనియర్లు ఎదురుచూస్తున్నరు. పీకే రిపోర్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తుంటే, ఆ రిపోర్ట్ పైన నమ్మకం పెట్టుకుని చాన్స్ కోసం వెయిట్ చేస్తున్న లీడర్లు మాత్రం సంబర పడుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గాల్లోనే ఈ రకమైన చర్చ జరుగుతోంది. కోదాడ, హుజూర్నగర్, నల్గొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో చాన్స్ దొరికితే పోటీ చేయాలని పలువురు సీనియర్లు ఆశతో ఉన్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో కచ్చితంగా కొత్త క్యాండిడేట్ తెరపైకి వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అవకాశం వస్తే తగ్గేదేలే...
పీకే రిపోర్ట్ మేరకు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి మార్చి హైకమాండ్ తమకు అవకాశం ఇస్తే పోటీ వెనుకడుగు వేసేదే లేదని పలువురు సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన పలు నియోజకవర్గాల్లో ఈ సారి కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. అదేవిధంగా గత
ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ
ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్ తప్పక వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ వీళ్లను కాదని కొత్త లీడర్లను తెరపైకి తేవాలని హైకమాండ్ భావిస్తే మాత్రం నల్గొండ లాంటి చోట్ల తమ వారసులను రంగంలోకి దింపాలని సీనియర్లు భావిస్తున్నారు. కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనూ గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువైనందున అక్కడ కూడా ఆశావహులు చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద పీకే రిపోర్ట్ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో అర్ధంగాక సిట్టింగ్లు టెన్షన్ పడుతుంటే, ఇతర నాయకులు మాత్రం పీకే రిపోర్ట్ తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
.