
కోవిడ్ -19 చికిత్సకు ప్లాస్మా థెరపీని అనుతించలేదని చెప్పింది కేంద్రం. ఇది సురక్షితమైన చికిత్స కాదని పేర్కొంది. ఇందుకు గాను మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం ప్లాస్మాను పరిశోధన కోసమే వినియోగించాలని తెలిపింది. శాస్త్రీయమైన ఆధారాలు లభించనంతకాలం కోవిడ్ – 19 సోకిన వారిపై ప్రయోగించకూడదని చెప్పింది. ప్లాస్మాను సరిగ్గా వినియోగించకపోతే ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుందని తెలిపింది. ప్లాస్మాతో చికిత్స చేయడానికి ప్రభుత్వ ఆమోదం లేదని… ప్రయోగాత్మకదశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.
కరోనా రోగులు వెంటిలేటర్ పై ఉన్న సందర్భాలలో మాత్రమే… కరోనా నయమైన రోగినుంచి ప్లాస్మాను తీసి వ్యాధి ముదురుతున్న వారికి ఇంజక్ట్ చేస్తారు… అయితే తప్పని పరిస్థితులలోనే ఇలాంటి చికిత్సను అందించగలమని పేర్కొంది. ఎరుపు మరియు తెల్ల రక్త కణాలను, ప్లేట్ లెట్లను రక్తం నుంచి తొలగించిన తర్వాత వచ్చే ద్రవమే ప్లాస్మా అని తెలిపింది. దేశంలో పలు వైద్య సంరక్షణ కేంద్రాలు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి తీసుకున్న ప్లాస్మా వైరస్ తో బాధపడే వారిపై ఉపయోగించాయని వాటి ఫలితాలు సానుకూలంగా వచ్చాయని చెప్పారు. అయితే మరిన్ని ప్రయోగాలు ప్లాస్మా మీద చేస్తున్నారని తెలిపారు.