ఆస్పత్రులను జాతీయం చేసి ఫ్రీగా ట్రీట్​మెంట్​ ఇవ్వాలె

ఆస్పత్రులను జాతీయం చేసి ఫ్రీగా ట్రీట్​మెంట్​ ఇవ్వాలె
  • సుప్రీంకోర్టులో ఢిల్లీ లాయర్​ పిటిషన్

న్యూఢిల్లీ: ‘కరోనా వేగంగా వ్యాపిస్తున్న ఈ టైంలో దేశంలోని అన్ని ప్రైవేటు మెడికల్​ ఇనిస్టిట్యూట్‌ల‌ను ప్రభుత్వం తన కంట్రోల్​లోకి తీసుకోవాలి.. ఆస్పత్రులు, ల్యాబ్​లు సహా అన్నింటినీ తాత్కాలికంగా జాతీయం చేసి సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. వైరస్ పరీక్షలతో పాటు ట్రీట్​మెంట్​కూడా ఫ్రీగా అందించేలా చూడాలి’ అని ఢిల్లీకి చెందిన లాయర్​ అమిత్​ ద్వివేది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని గురువారం పిల్​ దాఖలు చేశారు. ప్రభుత్వ ల్యాబ్​లతో పాటు ప్రైవేటు ల్యాబ్​లలో కూడా కరోనా టెస్టులను ఫ్రీగా చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఆస్పత్రులన్నింటిని జాతీయం చేయాలని ద్వివేది పిటిషన్​ వేశారు.
కరోనా ప్యాండెమిక్​ ను ఎదుర్కోవడానికి మన దేశంలో తగినన్ని వైద్య సదుపాయాలు లేవని ద్వివేది చెప్పారు. ఈ కష్టకాలంలో వైరస్​ను దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రైవేటు రంగంలోని ఆస్పత్రులు, లేబరేటరీలు, కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. బడ్జెట్​ కేటాయింపుల్లో ప్రభుత్వం వైద్య రంగంపై చిన్నచూపు చూస్తోందన్నారు. తక్కువ ఆదాయంగల దేశాలు కేటాయిస్తున్నన్ని నిధులు కూడా మన ప్రభుత్వాలు కేటాయించడంలేదన్నారు. ప్రభుత్వ హెల్త్​ కేర్​ సిస్టం ఇలా ఉంటే.. ప్రైవేటు హెల్త్​ కేర్​ సిస్టం మాత్రం వేగంగా పెరుగుతోందని చెప్పారు. మెడికల్​ టూరిజం కూడా ఏటా 200 శాతం అభివృద్ధి నమోదు చేస్తోందని ద్వివేది తన పిటిషన్​లో పేర్కొన్నారు.