
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. శుక్రవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన కేటీఆర్ కు సాలు దొర, సెలవు దొర అనే నినాదాలతో బీజేపీ మేడ్చల్ మల్కాజ్ గిరి అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంత్రి కేటీఆర్ పర్యటనలో తాజాగా వెలసిన ఫ్లెక్సీలు మరింత అగ్గిరాజేశాయి.
ఇక కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రూ.28.51 కోట్ల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి ఫ్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.