6 మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ

6 మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తరాఖండ్: దశాబ్ధాలుగా గంగా నదిని క్లీన్ చేసేందుకు అనేక పథకాలు తీసుకొచ్చినా… వాటిల్లో ప్రజా భాగస్వామ్యం, దూరదృష్టి లేదన్నారు ప్రధాని మోడీ. ఉత్త‌రాఖండ్ ‌లో నామామి గంగే మిష‌న్ కింద 6 మెగా ప్రాజెక్టుల‌ను మంగళవారం ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పాత పద్ధతులను పాటిస్తూ పోతే ఇప్పటికీ గంగా నది పరిస్థితి మారేది కాదని చెప్పారు. ఈ మధ్య తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని మరోసారి చెప్పారు మోడీ. ఢిల్లీలో ట్రాక్టర్ ను తగలబెట్టిన ఘటనను గుర్తు చేస్తూ… వారంతా రైతులను అవమానిస్తున్నారని ఆరోపించారు. MSP విషయంలో ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.

ఇన్నాళ్లూ పూజించిన మెషీన్లు, ప‌రిక‌రాల‌కు ఇప్పుడు నిప్పుపెట్టి రైతుల‌ను అవ‌మానిస్తున్నార‌న్నారు.  ఓపెన్ మార్కెట్ ‌లో రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునేందుకు ప్ర‌తిప‌క్షాలు అడ్డుప‌డుతున్నాయ‌ని తెలిపిన మోడీ.. మ‌ధ్య‌వ‌ర్తులు, ద‌ళారులు లాభం పొందే విధంగా ప్ర‌తిప‌క్షాల చ‌ర్య‌లు ఉన్నాయ‌న్నారు. రైతుల స్వేచ్ఛ‌ను వారు హ‌రిస్తున్నార‌ని .. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్యానికి సంబంధించి సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు ప్రధాని మోడీ.