
కరోనా మళ్లీ భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ఇప్పటికే కరోనా వైరస్ డేంజర్ బెల్స్ ను మోగిస్తుంది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని..అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణకు చర్యలపై ఆయన అధికారులతో చర్చించనున్నారు.
దేశంలో నాలుగు ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులు
చైనాలో మళ్లీ కరోనా వ్యాప్తికి కారణమవుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 మన దేశంలోనూ ఉన్నట్లు హెల్త్ ఎక్స్ పర్ట్ లు గుర్తించారు. ఇప్పటివరకు దేశంలో మూడు బీఎఫ్.7 కేసులు నమోదయ్యాయని బుధవారం అధికారులు వెల్లడించారు. తొలి రెండు కేసులను జులై, అక్టోబర్ నెలల్లో గుజరాత్ లో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిపుణులు గుర్తించారు. ఆ తర్వాత నవంబర్ లో ఒడిశాలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.