న్యూఢిల్లీ: సంక్షోభ పరిస్థితులను ఎలా అధిగమించాలో మన సంస్కృతి నేర్పిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. మన్కీ బాత్ కార్యక్రమంలో భారతీయ సంస్కృతి గురించి మోడీ పలు విషయాలు చెప్పారు. ఇలాంటి విపత్తు సమయంలో దేశ సంస్కృతి మనకు ఎమోషనల్ రీచార్జ్గా పనికొస్తుందన్నారు.
‘పురాతన అన్నపూర్ణ దేవి ప్రతిమను కెనడా నుంచి భారత్కు తిరిగి తీసుకొచ్చామనే విషయాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. దాదాపుగా వందేళ్ల కింద 1913లో వారణాసిలోని ఓ ఆలయం నుంచి ఈ విగ్రహాన్ని ఎవరో చోరీ చేశారు. మన చరిత్రలోని ముఖ్యమైన దశలను మనం నెమరేసుకోవాలి. కరోనా విపత్తు సమయంలోనూ ప్రజలు వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం భేష్. మన దేశ సంస్కృతి, గ్రంథాలపై ప్రపంచం ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంది. కొందరు భారత్ను కనుగొందామని వచ్చి ఇక్కడే ఉండిపోయారు. మరికొందరు తమ దేశాలకు తిరిగివెళ్లినా ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లలా తిరిగివెళ్లారు’ అని మోడీ పేర్కొన్నారు.