
వారణాసి: ఆధ్యాత్మిక నగరం వారణాసిలో క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. దాదాపు 450 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత అధునాతన వసతి సౌకర్యాలతో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. వారణాసి ఘాట్లను పోలిన విధంగా స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ నిర్మిస్తున్నారు. మహాదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు.
క్రికెట్ ద్వారా ప్రపంచం మొత్తం ఇండియాతో అనుసంధానం అవుతుందన్నారు. ఈ సందర్భంగా ‘నమో’ అని రాసి ఉన్న టీమిండియా జెర్సీని సచిన్.. మోదీకి బహుకరించాడు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, క్రికెట్ లెజెండ్స్ సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, కపిల్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.